
సినిమా రంగంలో కొందరి జీవిత గాథలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే సిల్క్ స్మిత జీవితం. అసలు పేరు విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరు సమీపంలోని కొవ్వలిలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. బంధువు అన్నపూర్ణమ్మ దత్తత తీసుకోవడంతో ఆమె మకాం ఏలూరుకు మారింది. చిన్నతనం నుంచే సినిమాలపై అమితమైన పిచ్చి పెంచుకున్న విజయలక్ష్మి, 18 ఏళ్ల వయసులో తన తల్లితో మద్రాస్ చేరుకుంది. హీరోయిన్గా రాణించాలనే కలలతో ఎంతో మంది నిర్మాతలను కలిసినా, ఆమెకు “గ్లామర్ లేదు”, “నటిగా పనికిరాదు” వంటి చేదు మాటలు ఎదురయ్యాయి. నల్లగా, బొద్దుగా ఉండడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం ఆమెకు ప్రతికూలతలుగా మారాయి. అయినా ఆమె ఆశలు వదులుకోలేదు. “చావోరేవో మద్రాసులోనే” అని నిశ్చయించుకుని, జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చినా సరే, “విజయ” పేరుతో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. సరిగ్గా అదే సమయంలో మలయాళంలో ఒక అవకాశం వచ్చింది. మలయాళ దర్శక నిర్మాతలు కేవలం శృంగార అప్పీల్తో కూడిన పాత్రలను కోరడంతో, తొలుత తటపటాయించిన విజయ, తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ చిత్రంతోనే విజయ అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి ఆమెపై పడింది. వండి చక్రం చిత్రంతో విజయ పేరు సిల్క్ స్మితగా మారిపోయింది. ఆమె మైకం తెచ్చే డాన్సులు, నిషా కళ్ళతో ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. వండి చక్రంను తెలుగులో ఘరానా గంగులు పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా స్మితనే అదే పాత్రను పోషించి బ్రహ్మరథం పట్టించుకుంది.
అప్పటి నుంచి ఏ హీరో సినిమాకైనా స్మిత డాన్స్ పాట తప్పనిసరి అయ్యింది. నిర్మాతలు ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఒక డాన్స్ కోసం 45 ఏళ్ల క్రితమే 50,000 రూపాయలు డిమాండ్ చేసినా, నిర్మాతలు “ఎంత రెమ్యూనరేషన్” అని అడగకుండా “కాల్ షీట్ ఎప్పుడు ఇస్తావు” అని అడిగేవారు. 1981 నుంచి 1996 వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా కొనసాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించి, డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సినిమా విజయానికి స్మిత పాట తప్పనిసరి అనేవారు. 1983లో తమిళంలో వచ్చిన నీతిపతి చిత్రానికి సిల్క్ స్మిత పాట లేకపోవడం వల్ల బయర్లు కొనుగోలు చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత స్మితతో ఒక పాట చిత్రీకరించిన వెంటనే సినిమా ఘన విజయం సాధించింది. ఆమె అభిమానం విచిత్రంగా ఉండేది; స్మిత కొరికిన కిల్లిని తినడానికి పోటీపడేవారు. 1984లో షూటింగ్లో ఆమె సగం కొరికిన యాపిల్ను ఆమె మేకప్ మ్యాన్ వేలం వేయగా, అది 26,000 రూపాయలకు అమ్ముడైందని చెబుతారు. తన పాత్రలకు, పాటలకు అనుగుణంగా దుస్తులను తనే డిజైన్ చేసుకునేది. నృత్య తారగానే కాకుండా, లేడీ జేమ్స్ బాండ్ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి, వీర విహారం, ప్రేమించి చూడు వంటి చిత్రాలను నిర్మించింది.
సినిమా జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో, ఆమె జీవితంలోకి డాక్టర్ రాధాకృష్ణ ప్రవేశించాడు. కెరీర్ పరంగా అండగా ఉంటానని నమ్మించి, ఆమె వ్యవహారాలన్నీ చూసుకున్నాడు. రాధాకృష్ణ చెప్పినట్లు నడుచుకున్న స్మిత, డబ్బు లెక్కలు పట్టించుకోలేదు. ఇలా సంతోషంగా ఉన్న స్మిత, 1996 సెప్టెంబర్ 22 రాత్రి 36 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులందరికీ షాక్నిచ్చింది. ఆమె మృతదేహం పక్కన దొరికిన సూసైడ్ నోట్లో “బాబు మంచివాడు”, “వేరెవరో తనను మోసం చేశారు” అని రాసి ఉంది. ఆ లేఖలో “నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నేను నమ్మినవారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు. అందరూ నా కష్టం తిన్నవారే, నా నాశనం కోరేవారే. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసు” అని ఉంది. ఈ మానసిక ఒత్తిడిని భరించలేకనే ఆమె ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్మిత మరణవార్త తెలిసినా, పరిశ్రమ నుంచి చాలామంది చివరి చూపుకు రాలేదు. అయితే, హీరో అర్జున్ మాత్రం వచ్చి ఆమె మృతదేహాన్ని చూసి ఏడ్చారు. కొద్ది రోజుల ముందు తాను చనిపోతే వస్తావా అని అర్జున్ని స్మిత అడిగిన కారణంతో ఆయన వచ్చారు. 2011లో ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం డర్టీ పిక్చర్ ఆమె జీవితం, పోరాటం, విషాదాంతం గురించి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.
Arjun
పెళ్లి చేసుకోకుండా నాట్యానికే జీవితం అంకితం చేసిన టాలీవుడ్ హీరోయిన్