
తెలుగు సినీ చరిత్రలో తనదైన హాస్యంతో, అమాయకపు ముఖంతో, పదునైన డైలాగ్ టైమింగ్తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన హాస్యనటుడు పొట్టి ప్రసాద్. ఆయన పూర్తి పేరు కవిపురపి ప్రసాదరావు. కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో 1929 జనవరి 5న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ప్రసాద్ను, ఆయన మేనత్త మైనంపాటి కామేశ్వరమ్మ కన్న తల్లిలా పెంచి పెద్ద చేశారు, క్రమశిక్షణ అలవాటు చేశారు. పొట్టిగా ఉండటంతో అందరూ ఆయన్ని పొట్టి ప్రసాద్ అని పిలిచేవారు, చివరికి అదే పేరు ఆయనకు స్థిరపడింది. బీకాం వరకు చదువుకున్న ప్రసాద్కు నాటకాలంటే ఎంతో ఇష్టం. అయితే, ఆయన మేనత్తకు నాటకాలలో నటించడం ఇష్టం ఉండేది కాదు. దాంతో, ఆమెకు తెలియకుండా గోడ దూకి నాటక ప్రదర్శనలకు వెళ్లి వచ్చేవారు. నటన పట్ల ఆయనకున్న అంకితభావం దీనిని స్పష్టం చేస్తుంది. హాస్యనటుడికి ఉండాల్సిన అమాయకపు ముఖం, అద్భుతమైన డైలాగ్ టైమింగ్ ప్రసాద్ సొంతం. స్టేజీ మీద ఆయన నటిస్తుంటే ప్రేక్షకులు పగలబడి నవ్వేవారు. 12 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించిన పొట్టి ప్రసాద్, రాజబాబుతో కలిసి విజయవాడలోని రసన సమైక్యలో చేరారు. రాజబాబు, పొట్టి ప్రసాద్ కలిసి నటించిన “దొంగ వీరుడు” నాటకం వారికి మంచి పేరు తెచ్చింది.
సినిమాల్లో నటించాలనే తపనతో ఇద్దరూ మద్రాస్ చేరుకున్నారు. నిర్మాతల దృష్టిలో పడటానికి వారి సమక్షంలో “కథ కంచికి”, “నాలుగేళ్ళ చావిడి”, “కుక్క పిల్ల దొరికింది” వంటి నాటకాల్లో నటించారు. 1960లో వారికి సినీ అవకాశాలు లభించాయి. రాజబాబు “సమాజం” చిత్రంతో, పొట్టి ప్రసాద్ “అప్పుచేసి పప్పుకూడు” చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజబాబు “సత్య హరిశ్చంద్ర”తో మంచి గుర్తింపు పొంది టాప్ కమెడియన్గా మారగా, పొట్టి ప్రసాద్ “పూజా ఫలం” సినిమాతో పేరు తెచ్చుకున్నారు. రాజబాబు లేని సినిమా ఉండేది కాదన్నంతగా ఆయన డిమాండ్ ఉండేది. ప్రసాద్కు అవకాశాలు వచ్చినా, రాజబాబు స్థాయి టాప్ పొజిషన్కు రాలేకపోయారు.
పొట్టి ప్రసాద్ చాలా సింపుల్గా జీవించేవారు. ఇంట్లో లుంగీకి బదులు చిన్న టవల్ కట్టుకుని తిరిగేవారు. ఆర్భాటాలు ఆయనకు నచ్చవు. ఆయనకు సంకల్ప శక్తి ఎక్కువ. సిగరెట్, జర్దా వంటి అలవాట్లను మానేసి, చివరికి ముక్కుపొడిని కూడా వదిలేశారు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రావికొండలరావు, చిడతల అప్పారావు వంటి వారితో ఆయనకు మంచి స్నేహం ఉండేది. కళాతపస్వి కే. విశ్వనాథ్, జంధ్యాల వంటి దర్శకులు తమ చిత్రాల్లో ఆయనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. “సాగర సంగమం”లో “నమస్కారం అండయ్యా”, “రెండు రెళ్ళు ఆరు”లో “పితా”, “చంటబ్బాయి”లో పత్రికా ఎడిటర్ పాత్రలు ఆయన నటనకు మచ్చుతునకలు.
వందలాది చిత్రాల్లో హాస్య భూమికలు పోషించిన పొట్టి ప్రసాద్ చివరి రోజుల్లో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డారు. గొంతు పాడై మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. దాదాపు 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ఆయనకు, రెండేళ్ల వైద్యం తర్వాత తిరిగి మాట వచ్చినా, అప్పటికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. 1998లో మళ్లీ అనారోగ్యం పాలై చెన్నైలోని ఒక ఆసుపత్రిలో 45 రోజులు చికిత్స పొందారు. అపస్మారక స్థితిలోనే 1998 ఫిబ్రవరి 23న నటరాజులో ఐక్యమయ్యారు. ఆయనకు జగన్నాధరావు అనే ఒక్క కొడుకు ఉన్నారు. పొట్టి ప్రసాద్ తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించి, చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి