
స్టార్ మా ఛానెల్లో మంచి టాక్తో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగనుందో చూద్దాం. గ్రామదేవత మొక్కు తీర్చేస్తే అంతా మంచే జరుగుతుందన్న సిద్ధాంతి మాటలపై నమ్మకంతో రుద్రవరం వెళ్లడం ప్రమాదకరం అని నారాయణ వారిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. రుద్రవరంలో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? సస్పెన్స్తో ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూసేద్దాం.
రుద్రవరం వెళ్లడానికి లగేజ్ సర్దుకుని అంతా రెడీ అవుతారు. తను కూడా వస్తానని కేశవతో అంటుంది శైలు. మా అత్తగారి ఊరు చూడాలని ఉంది అంటే పెళ్లి కాకుండా నువ్వు రావడం మంచిది కాదు అంటాడు కేశవ. మనీషా ఏమైనా మీ ఇంట్లో మనిషా? తనని ఎందుకు తీసుకెళుతున్నారు.. మనీషా ప్రాబ్లెమ్లో ఉంది వాళ్ల బావ తీసుకెళ్లడానికి వచ్చాడు అందుకే మా ఇంట్లో ఉంటుంది అంటాడు కేశవ్. కారు ముందు నిమ్మకాయలు పెట్టి మొక్కుతాడు నారాయణ. నేనొద్దంటే నా మాట వినకుండా పిల్లలు ఆ ఊరొస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా తప్పడం లేదు. ఇన్ని సంవత్సరాలు ఆ ఊరికి ఎందుకు దూరంగా ఉన్నానో నీకు తెలుసు ఈ రోజు వెళ్లితీరాల్సి వచ్చింది. నా పిల్లలకు నాకు ఏ ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడు తల్లీ అని రుద్రాంబికను వేడుకుంటాడు.
రుద్రవరం దగ్గరలో ఓ చెట్టు రోడ్డుకి అడ్డంగా పడటంతో కారులో నుంచి అంతా కిందికి దిగుతారు. మహా, మనీషా మీరు దిగకండి ఈ ఏరియా సేఫ్ కాదు అంటాడు నారాయణ. చెట్టును అడ్డంగా పడేసిన పాలెగాళ్లు కత్తులతో నారాయణపై దాడి చేస్తారు. చక్రి, కేశవ, మాధవ్ వెళ్లగొడతారు. ముసలోడు ఒక్కడే రాలేదు నలుగురు కొడుకులు కోడళ్లు కూడా వచ్చారని చెబుతారు. భార్యను చంపి జైలుకి వెళ్లాడు కాబట్టి బతికిపోయాడు. కానీ ఇప్పుడు ఊరికే వచ్చే ధైర్యం చేసాడు. పొలిమేర దాటక ముందే వాడి ప్రాణాలు తీస్తా అంటాడు. నారాయణ ఒక్కడే వస్తాడు అన్నావు కొడుకులు కోడళ్లు కూడా వచ్చారు వాళ్లు మా వాళ్లని కొట్టారు అని రమణయ్యకు ఫోన్ కొట్టి చెబుతాడు. అందుకు నువ్వు సిగ్గు పడాలి.. నీ పగ నారాయణ మీద.. నారాయణ ప్రాణాలతో తిరిగిరాకూడదు పెదనాన్న రమణయ్య అంటాడు. కాకతీయ సత్రంలో బసకు ఏర్పాట్లు చేస్తాడు కేశవ ఫ్రెండ్ సతీష్. సత్రంలో గాయత్రి సర్ప్రైజ్ ఇస్తుంది. మీరొస్తున్నారని తెలిస్తే మీతో కలిసి వచ్చేదాన్ని అంటుంది. ఇక్కడా దాపురించారా అంటూ గాయత్రి తల్లి బయటికి రావడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.