Nayanthara: చెన్నై వరద బాధితులకు నయనతార ఆపన్న హస్తం.. నెటిజన్ల విమర్శలు.. కారణమిదే

|

Dec 07, 2023 | 6:36 PM

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా తన వంతుగా సాయాన్ని అందించింది. తన సంస్థ 'ఫెమీ 9' ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు అందించారు. దీంతో నయన తారపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం లేడీ సూపర్‌ స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు

Nayanthara: చెన్నై వరద బాధితులకు నయనతార ఆపన్న హస్తం.. నెటిజన్ల విమర్శలు.. కారణమిదే
Nayanthara
Follow us on

మిచౌంగ్‌ తుపాన్‌ బారిన పడిన తమిళనాడు ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా వేలాది మంది రోడ్డుపై పడ్డారు. కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జనాలు ఆకలి బాధలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు.  చెన్నై వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇక సినిమా తారలు కూడా తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. తమ అభిమానులను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా తన వంతుగా సాయాన్ని అందించింది. తన సంస్థ ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు అందించారు. దీంతో నయన తారపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం లేడీ సూపర్‌ స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఫెమీ 9’ కంపెనీకి చెందిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉన్న ప్రత్యేక వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడమే నెటిజన్ల విమర్శలకు కారణం. దీనికి సంబంధించిన వీడియోను ‘పెమీ 9’ కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. వీడియో చివర్లో, స్థానిక మహిళలు కొందరు నయనతారకు కృతజ్ఞతలు తెలపడం ఇందులో చూడవచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు.. మహిళలను బలవంతంగా పెట్టి సీన్ చిత్రీకరించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కష్టకాలంలోనూ కొందరు కంపెనీని ప్రమోట్ చేస్తున్నారా..? అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. అయితే చాలా మంది నయనతార ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. నయనతార ప్రకటనలేవైనా సరే ప్రజలకు సహాయం చేసే మంచి మనసు కలిగి ఉందంటూ చాలామంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. కాగా నయనతార నటించిన లేటెస్ట్‌ సినిమా అన్నపూరణి కూడా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇందులోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బ్రాహ్మణులు, హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. నయన్‌ సినిమాపై నిషేధం విధించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫెమీ 9 షేర్ చేసిన వీడియో

అన్నపూరణి ప్రమోషన్లలో నయన తార

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.