
డిఫరెంట్ కథతో ఈ మధ్య కాలంలో తెరకెక్కుతోన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్తగారితో కలిసి ఉండలేనని, వేరు కాపురం పెడతామని పెళ్లికి ముందే ఆ కాబోయే వరుడితో అంటే.. తనకు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతానని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు తల్లి.. మరో వైపు కాబోయే భార్య మధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎల్జీఎం’ (LGM – Lets Get Married). ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను ధోని ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో.. నిర్మాత సాక్షి ధోని, హీరో హరీస్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానా, నదియా, త్రిపుర ప్రొడక్షన్స్ త్రిపుర పసుపులేటి తదితరులు పాల్గొన్నారు. నిట్రో స్టార్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నిట్రో స్టార్ సుధీర్ బాబు మాట్లాడుతూ “ ‘ఎల్జీఎం’ (LGM – Lets Get Married) ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. క్రికెట్ ప్రపంచంలో ధోనిగారు ఓ లెజెండ్. ఆయనొక సొంత బ్యానర్ స్టార్ట్ చేసి సినిమా చేయటం చూసి థ్రిల్ అయ్యాను. క్రికెట్లో ఆయనెలాంటి విజయాలను సాధించారో అలాంటి సక్సెస్ను సినిమా రంగంలోనూ సాధించాలని కోరుకుంటున్నాను. సాక్షిగారికి ఆల్ ది బెస్ట్. జెర్సీలో మంచి రోల్తో మెప్పించిన హరీష్ కళ్యాణ్ ఈసారి ‘ఎల్జీఎం’ (LGM – Lets Get Married)తో మన ముందుకు వస్తున్నారు. లవ్ టుడేతో మనకు దగ్గరైన ఇవానా ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. హృదయం సినిమాకు వర్క్ చేసిన విశ్వజీత్ విజువల్స్ గొప్పగా ఉన్నాయి. రమేష్ తమిళ్ మణి డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా గొప్ప వర్క్ చేశారు. నదియాగారికి, యోగిబాబుగారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమానుతెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న త్రిపుర పసుపులేటి, డా.పవన్గారు అభినందనలు“ అన్నారు.