
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్. జానకి ఒక చరిత్ర.! స్వరాల తోటలో పూసిన ఒక అపురూప పారిజాతం ఆమె! తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఐదు దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారు. ఆమె కేవలం పాటలు పాడలేదు, కోట్లాది మంది ఒంటరితనానికి తోడుగా నిలిచింది. ఆమె గొంతులోంచి జాలువారిన ప్రతి అక్షరం ఒకరి గుండెల్లో గాయానికి మందు వేస్తే, మరొకరి కళ్లల్లో ఆనంద బాష్పమై మెరిసింది. ప్రేమలోని అమాయకత్వాన్ని, విరహంలోని వేదనను, అమ్మ లాలిపాటలోని అమృతాన్ని, దైవ సన్నిధిలోని పరవశాన్ని… ఇలా ఏ పాట అయినా.. ఏ భావాన్నైనా తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోశారు.
భారతీయ సినీ సంగీత చరిత్రలో ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఇళయరాజా – ఎస్. జానకి’ కాంబినేషన్ ఒక సంచలనం. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన పాటలు దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్గా మారాయి. ఎస్పీబీతో కలిసి జానకి పాడిన వేలాది యుగళ గీతాలు ప్రేమికులకు అమృతకావ్యాలుగా నిలిచాయి. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె పాడిన మెలోడీలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె అద్భుత గాత్రానికి పురస్కారాలు దాసోహమన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కేవలం ఒక మ్యూజికల్ హిట్ కాదు… సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీని శాసించిన ఒక ‘ఎమోషనల్ అడిక్షన్’. ఇళయరాజా హార్మోనియం పెట్టెపై వేళ్లు కదిపితే.. జానకమ్మ తన గాత్రంతో ఆ ట్యూన్కు ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు. ‘సిరిమల్లె పువ్వా’ అంటూ ఆమె పలికిన అమాయకత్వం, ‘జననీ జననీ’ అంటూ సాగిన మైండ్ బ్లోయింగ్ భక్తి ప్రయాణం… శ్రోతల గుండెల్లో ఒక ‘హీలింగ్ థెరపీ’లా నిలిచిపోయాయి.
ఇళయరాజా 1000కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తన ఎన్నో చిత్రాల్లో ఎస్.జానకితో పాటలు పాడించారు. అందుకే ఆయన జానకిని తన ఆప్త గాయనిగా భావించేవారు. ఇళయరాజాకు ఎన్నో విజయవంతమైన పాటలు అందించిన జానకి, ఆయన స్వరపరిచిన ఒక పాటని పాడలేక ఏడ్చిన ఘటన కూడా ఉంది. ఈ విషయాన్ని జానకే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. సాధారణంగా జానకి వేదికపై అయినా, రికార్డింగ్ థియేటర్లో అయినా పాట పాడేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యేవారు కాదు. ఆమె శరీరం కూడా కదిలేది కాదు. ఒకే చోట నిలబడి పాడేవారు. కానీ ఇళయరాజా స్వరపరిచిన ఒక పాట మాత్రం ఆమెను తీవ్రంగా కదిలించింది. ఆ పాటే ‘అచ్చాణి’ చిత్రంలోని ‘మాతా ఉన్ కోవిలిల్..’. 1978లో విడుదలైన ఈ చిత్రంలో ముత్తురామన్, లక్ష్మి, అశోకన్, మనోరమ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలు ప్రజాదరణ పొందాయి. ఎస్. జానకి పాడిన ‘మాతా ఉన్ కోవిలిల్..’ పాట ఇప్పటికీ ఆలయ ఉత్సవాల్లో వినిపిస్తూనే ఉంటుంది. యేసును కనకుండా తల్లిగా మారిన మేరీ మాత గురించి చెప్పే ఆ పాట పాడుతుప్పుడు జానకి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె పాట ఆపేయగానే స్టూడియోలో ఉన్న వారంతా “ఏమైంది?” అని అడిగారు. “ఈ పంక్తులను పాడడం నాతో అయ్యేపనిలా లేదు. ఇవి నన్ను చాలా కదిలిస్తున్నాయి” అని చెప్పి ఏడ్చారు. ఆ తర్వాత ఇళయరాజా జానకిని ఓదార్చి, కొన్ని గంటలు విరామం ఇచ్చి, మళ్లీ పాటను రికార్డు చేశారు. ఈ పాట పాడేటప్పుడు జానకి ఎలా ఏడ్చారో, అదే విధంగా ఈ పాట విన్న ఎంతోమంది ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి