
తెలుగు సినిమా ప్రపంచంలో తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజంతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న నటుడు నూతన ప్రసాద్. “దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు ” అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ తో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులరే. విలనిజం, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన బాణీని కలిగిన నటుడు ఆయన. స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్.. ఆయన చెప్పే డైలాగ్స్ కు థియేటర్లు అరుపులు, విజిల్స్ తో దద్దరిల్లిపోయేవి. నటుడుగా కోట్లాది మంది అభిమానం పొందిన ఆయన సినీ ప్రయాణం సాగింది కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం ఆయన జీవితాన్ని చీకటి మయం చేసింది. అయినా తాను నమ్ముకున్న నటనతోనే సినీ సామ్రాజ్యాన్ని ఏలారు. అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించిన ఆయన.. చదువుకునే రోజుల నుంచి నాటకాలు, నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకాలతో అందరిని అలరించేవారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
1970లో మద్రాసు చేరుకున్న ఆయన అక్కడ నాటకాలు వేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1973లో అక్కినేని నాగేశ్వరరావు, బాపు కాంబోలో వచ్చిన అందాల రాముడు చిత్రంలో అవకాశం అందుకున్నారు. మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆయన 1975లో మళ్లీ బాపు తెరకెక్కించిన ముత్యాల ముగ్గు సినిమాలో నటించారు. నిత్య పెళ్లి కొడుకుగా ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ అవకాశాలు అంతగా రాలేదు. ఆ బాధతోనే మద్యానికి బానిసయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండిపోయిన ఆయన… తర్వాత తన పేరును నూతన ప్రసాద్ గా మార్చుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. 1978లో వచ్చిన చలి చీమలు సినిమాతో నూతన ప్రసాద్ గా వెండితెరకు పరిచయమయ్యారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
1982 నుంచి ఆయన బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. సంవత్సరానికి 10 సినిమాలకు పైగా నటించారు. 1985లో అత్యధికంగా 22 సినిమాల్లో నటుడిగా కనిపించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన డైలాగ్ డెలివరీతో పాపులర్ అయిన ఆయన.. తన కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు వేశారు. స్టార్ హీరోస్ అందరితో నటించారు. అయితే రాజేంద్ర ప్రసాద్ తో కలిసి బామ్మబాట బంగారు బాట సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెమూకకు తీవ్ర గాయమైంది. దీంతో వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయినప్పటికీ తన ఆత్మ విశ్వాసం తగ్గకుండా వీల్ చైర్ లో ఉండి దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించి సినీ ప్రపంచాన్ని ఏలారు. ఆయన నటించిన చివరి చిత్రం కన్నడలో వచ్చిన శ్రీమతి. చాలా కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ఆయన 2011 మార్చి 30న తుదిశ్వాస విడిచారు. కానీ ఇప్పటికీ ఆయన నటన, పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..