
టాలీవుడ్ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, దిగ్గజాలతో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో తాను తీసిన ఘటోత్కచుడు చిత్రంపై అనేక వివాదాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు. ఒకరు మాయాబజార్ సినిమాకు పోటీగా ఘటోత్కచుడు తీశానని అన్నారు. కానీ తాను ఈ చిత్రాన్ని దానికి పోటీగా చేయలేదని, తన ప్రాజెక్టును దానికంటే ముందే ప్రకటించామని వివరించారు. అలాగే ఆనాడు పలు కృష్ణారెడ్డి హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలు నాగార్జున, రాజశేఖర్, శ్రీకాంత్ స్పెషల్ రోల్స్లో కనిపించేవారు. దాని గురించి మాట్లాడుతూ.. అప్పట్లో హీరోలందరూ ఉత్సాహంగా ఉండేవారని, తనతో పనిచేయడానికి ఆసక్తి చూపేవారని తెలిపారు.
యమలీల చిత్రం పెద్ద హిట్ అయిన తర్వాత, పెద్ద నటులు తనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. నాగార్జున, రాజశేఖర్ లాంటివారు తాను అడగ్గానే కాదనకుండా అంగీకరించడం వారి గొప్పతనం అని కృష్ణారెడ్డి అన్నారు. ఒక హీరో ఇంకొక హీరోను సెట్స్కి ఆహ్వానించడం లాంటి అందమైన సంప్రదాయాలను తాము ప్రోత్సహించామని, ఇది ఎలాంటి సమస్యలు లేకుండా కలిసిమెలిసి పనిచేసే వాతావరణాన్ని సృష్టించిందని వివరించారు.
నాగార్జునతో ప్రకటించిన రాజ్ కుమారుడు చిత్రం బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిందని ఎస్.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రొడ్యూసర్ నర్సా రెడ్డి బడ్జెట్ను భరించలేనని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆయన అన్నారు. అయితే, అది కచ్చితంగా ఒక సంచలన విజయం సాధించే సినిమా అని, గొప్ప స్క్రిప్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. బాహుబలి అంత పెద్ద సినిమా కాకపోయినా, అలాంటి స్థాయిలో మంచి స్టాండర్డ్స్ ఉన్న స్క్రిప్ట్ అని తెలిపారు. తన మార్కెట్ మెరుగుపడినప్పుడు ఆ చిత్రాన్ని మళ్ళీ తెరకెక్కిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.