
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇప్పటి సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుత తరం సినిమాలు, ప్రేక్షకుల అభిరుచులు, తన రాబోయే చిత్రాల గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుత కాలంలో వస్తున్న కొన్ని కొత్త సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. కొన్ని సినిమాలకు కూడా కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు, పిల్లల ముందు ఇబ్బందికరమైన సన్నివేశాలు రావడం వల్ల ప్రేక్షకులు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక చిన్న సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతుంటే థియేటర్కు వెళ్లానని, కానీ ఆ సినిమా నచ్చక ఇంటర్వెల్లోనే దండం పెట్టేసి వచ్చేసానని ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఒక సినిమా గురించి మాట్లాడుతూ, అందులో నటీనటులు బాగానే కష్టపడినప్పటికీ, సినిమా చూసే విధంగా లేదని , బోర్ కొడుతుందని ఇతరులు చెప్పడంతో తాను ఆ సినిమా చూడలేదని పేర్కొన్నారు.
సినిమా స్క్రీన్ప్లే గురించి ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఆయన వివరించారు. థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకుడిని సినిమా ప్రారంభమైన మొదటి 4 నిమిషాల్లో లేదా గరిష్టంగా 7 నిమిషాల లోపు కథలోకి లాక్ చేయాలని, అప్పుడే వారికి కథపై ఆసక్తి కలిగి బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పారు. ఇక తన భవిష్యత్తు చిత్రాల కోసం ‘క్లెన్స్డ్ ఫిలిమ్స్’ (Cleansed Films) అనే సరికొత్త బ్యానర్ను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తన నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడూ పరిశుభ్రంగా, కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఉంటాయని చెప్పారు.
ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్లోనే మైలురాయి లాంటి సినిమా యమలీల. ఆలీని హీరోగా పరిచయం చేస్తూ, యముడి పాత్రలో సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నటనతో అవుట్ అండ్ అవుట్ కామెడీని పండించారు. తల్లి సెంటిమెంట్, అద్భుతమైన పాటలతో ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. డబ్బు ఆశతో భర్తను అమ్ముకునే భార్య అనే ఒక విలక్షణమైన పాయింట్తో శుభలగ్నం సినిమాను తెరకెక్కించారు. జగపతిబాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఇందులోని కామెడీ ట్రాక్స్, ముఖ్యంగా ‘చినుకు చినుకు అందెలతో’ పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్.