
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తన ప్రయాణం, అనుభవాలపై మాజీ కంటెస్టెంట్ గాయత్రి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగిన పిల్లల శక్తిని, వారి తల్లిదండ్రుల త్యాగాలను సమాజానికి చాటిచెప్పాలనేదే తన అసలు లక్ష్యమని గాయత్రి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ముందుగా గాయత్రి తన వ్యక్తిగత నేపథ్యాన్ని పంచుకుంటూ, ఖమ్మం స్వస్థలమని, తనకు ఒక సంవత్సరం వయసున్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోయారని తెలిపారు. తన తల్లి ఒక బ్యూటీషియన్ మరియు టైలర్గా పనిచేస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనను పెంచిందని చెప్పారు. ఆమె తల్లి చేసిన త్యాగాలు, ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కెనడాలో మాస్టర్స్ చదువు పూర్తి చేయగలిగానని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే తన నిర్ణయాన్ని తల్లి మొదట వ్యతిరేకించినా, తర్వాత అంగీకరించారని, తన ఆరోగ్య సమస్యలు, తల్లి ఒంటరితనం కారణంగా విదేశాల నుండి తిరిగి వచ్చానని తెలిపారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎదురైన సవాళ్ళను, ముఖ్యంగా క్లిప్స్ టాస్క్ను గాయత్రి వివరించారు. ఈ టాస్క్లో తన చర్మం సున్నితత్వం కారణంగా క్లిప్స్ పెట్టుకోవడం అత్యంత బాధాకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. విపరీతమైన నొప్పి, రక్త ప్రసరణ ఆగిపోవడం, వణుకు వచ్చిందని, దాదాపు ఫిట్స్ వచ్చినంత పని అయిందని తెలిపారు. ఈ క్లిప్స్ తీయడానికి తోటి కంటెస్టెంట్లు అభిజిత్, నవదీప్, శ్రీముఖి తదితరులు ముందుకు వచ్చి సహాయం చేశారని, ముఖ్యంగా అభిజిత్ తన కాళ్ళకు ఉన్న క్లిప్స్ తీయడంలో తోడ్పడ్డారని చెప్పారు.
ఈ ఒక్క టాస్క్లో గెలవలేకపోయినా, తనను టాప్ 15లో ఎంపిక చేయడానికి కేవలం శారీరక బలం మాత్రమే కాదని, మొత్తం పర్ఫామెన్స్ ను పరిగణనలోకి తీసుకున్నారని గాయత్రి అన్నారు. ఆటలో తన ఆసక్తి, ఇతరుల కోసం నిలబడటం, తన కోసం తాను నిలబడటం, టాస్కులలో నిజాయితీ, మానసిక ధైర్యం వంటి అంశాలు ముఖ్యమని ఆమె అన్నారు. ప్రేక్షకులు తమను కేవలం ఆ ఒక్క టాస్క్ ఆధారంగా అంచనా వేయడం సరికాదని, షో నిర్వాహకులు కంటెస్టెంట్ల మొత్తం ప్రవర్తన, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, నిజాయితీ, టీమ్మేట్స్తో అనుబంధం వంటి అనేక అంశాలను పరిశీలిస్తారని గాయత్రి వివరించారు. ఈ మధ్య కాలంలో కామనర్స్ బిగ్ బాస్ విజేతలుగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, సాధారణ ప్రజలకూ ప్రేక్షకుల నుంచి బలమైన మద్దతు లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, మానసిక దృఢత్వమే బిగ్ బాస్లో తన ప్రయాణానికి ఆయువుపట్టు అని గాయత్రి చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.