
చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు ఎదుర్కొనే సవాళ్లు, ముఖ్యంగా లొకేషన్ల అనుమతులు, ఖర్చుల గురించి సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యెగనంద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పర్మిషన్ లేకుండా షూటింగ్ చేస్తే వచ్చే సమస్యలు, పోలీసు అనుమతుల ప్రక్రియ, ఖర్చులు, అలాగే విక్రమార్కుడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఘర్షణను ఆయన వివరించారు. లొకేషన్ల అద్దెలు ఒక్కో ప్రదేశాన్ని బట్టి మారుతాయని యెగనంద్ పేర్కొన్నారు. ప్రగతి రిసార్ట్స్ వంటివి రోజుకు లక్ష రూపాయలు తీసుకుంటే, అలకృత గార్డెన్స్ వంటివి రోజుకు రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తాయి. శంషాబాద్ వంటి ప్రాంతాల్లో రెండు లక్షలు తీసుకునే హౌసులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని ఇళ్లు 50,000 నుంచి 1,50,000 వరకు తీసుకుంటాయని, దీనికి ఒక కచ్చితమైన కొలమానం అంటూ ఉండదని ఆయన అన్నారు. ఒకప్పుడు మద్రాసులో నెహ్రూ బిల్డింగ్, కాలేజీ రోడ్లోని ఇళ్లు రోజుకు రూ. 2,000, రూ. 3,000 అద్దెకు తీసుకునేవారని, అప్పటికి అది చాలా ఎక్కువ ఖర్చుగా భావించేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ఆర్ట్ డైరెక్టర్లు కూడా ఇళ్లను లీజుకు తీసుకుని షూటింగ్ల కోసం అద్దెకు ఇస్తున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి వెనుక ఉన్న ఒక భవనంలో ఎప్పుడూ షూటింగ్లు జరుగుతూ ఉంటాయని, తాము 100% లవ్ చిత్రాన్ని 40 రోజులు అక్కడే చిత్రీకరించామని యెగనంద్ పేర్కొన్నారు.
పోలీసుల అనుమతుల విషయానికి వస్తే, అధికారిక ప్రక్రియ చాలా ఖరీదైనదని యెగనంద్ వివరించారు. కమిషనర్ కార్యాలయం నుండి కానిస్టేబుల్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ప్రతి నాలుగు గంటల షిఫ్ట్కు వారు ఛార్జ్ చేస్తారు. ఇది చాలా ఎక్కువ అవుతుందని, ఒక కార్యక్రమానికి లక్ష రూపాయల వరకు కట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అందువల్ల చాలా మంది ప్రొడక్షన్ యూనిట్లు వచ్చిన స్థానిక పోలీసు అధికారులకు ఏదో రకంగా చెప్పి, పరిస్థితిని చక్కదిద్దుకుంటాయని ఆయన అన్నారు.
విక్రమార్కుడు చిత్ర చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను యెగనంద్ వివరించారు. గౌలి దొడ్డి వెనుక ఉన్న ఒక క్వారీలో షూటింగ్ కోసం రూ.12,000 చెల్లించి అనుమతి తీసుకున్నారట. చిత్రీకరణ ప్రారంభమైన రెండు గంటల తర్వాత, క్వారీ ఓనర్ వచ్చి, తనకు బాంబులు పేల్చడానికి ఆ రోజే అనుమతి వచ్చిందని, రెండు గంటల పాటు షూటింగ్ ఆపివేయాలని కోరాడు. అప్పటికే అక్కడ గుర్రాలు, మనుషులు, జూనియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, అంత మందిని తరలించడం కష్టం కావడంతో ప్రొడక్షన్ యూనిట్ నిరాకరించిందని తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓనర్ మనుషులు యూనిట్ సభ్యులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి చేతికి, యెగనంద్ గారికి తలపై గాయాలయ్యాయి. రాజమౌళి గారి కారు అద్దం కూడా ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా షూటింగ్ చేసినందుకు ప్రొడక్షన్ యూనిట్పై కేసు నమోదు చేశారట.. ఆ రోజు షూటింగ్ ఆగిపోగా ప్రొడ్యూసర్ ఎం.ఎల్. కుమార్ చౌదరి యూనిట్ సభ్యులను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కేసు దాదాపు రెండేళ్లు నడిచింది. చివరికి క్వారీ ఓనర్ తన తప్పు తెలుసుకుని, యూనిట్కు నష్టపరిహారం చెల్లించి క్షమాపణ చెప్పాడని యెగనంద్ తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.