
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్కి సమయపాలన అంటే ప్రాణం. ఆయన సెట్స్లో ఉంటే పని చకచకా జరిగిపోవాల్సిందే. అలాంటిది ఒక పాట కోసం ఏకంగా వారం రోజుల పాటు వేచి చూడాల్సి వస్తే ఆయన సహనం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ‘శ్రీరంగనీతులు’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్లో ఆచార్య ఆత్రేయతో ఆయనకు ఎదురైన ఒక వింత అనుభవం గురించి దర్శకుడు కనగల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలోని గ్లాస్ హౌస్లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. చక్రవర్తి ట్యూన్ రెడీ చేశారు, డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓకే చెప్పారు.
ఏఎన్ఆర్కి ఆ పాటలో శ్రీదేవితో సమానంగా స్టెప్పులు వేయాలని ఉంది, అందుకే ట్యూన్ కూడా చాలా మాస్గా ఉండేలా చూసుకున్నారు. కానీ అసలు సమస్య పాట రాయడమే. ఆత్రేయ పెన్ పట్టుకుని కూర్చున్నారే తప్ప, ఒక్క ముక్క కూడా రాయడం లేదు. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు గడిచింది.. ఏకంగా ఏడో రోజు వచ్చినా ఆత్రేయ నుంచి పల్లవి రాలేదు. ఏఎన్ఆర్కి కోపం నషాళానికి అంటింది. ప్రతిరోజూ సిట్టింగ్కి రావడం, ఖాళీగా కూర్చోవడం ఆయనకు నచ్చలేదు. చివరకు సహనం కోల్పోయి, “ఇక లాభం లేదు, మీకు పాట రాదు.. మీరు మద్రాస్ వెళ్ళిపోండి” అని ఆత్రేయని కఠినంగా అనేశారు. దాంతో వాతావరణం అంతా వేడెక్కిపోయింది.
ఆ రాత్రి కోదండరామిరెడ్డి.. ఆత్రేయ హోటల్ గదికి వెళ్లి కాళ్ల మీద పడి బతిమిలాడారు. అప్పుడు ఆత్రేయ తనదైన స్టైల్లో “నేను రాస్తే అదిరిపోద్ది, రాయకపోతే నీకు అదిరిపోద్ది” అని చమత్కరించారు. ఆ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కనగల జయకుమార్ని పక్కనే కూర్చోబెట్టుకుని, చివరకు ‘నడుము ఓకే, నడక ఓకే, కళ్ళు ఓకే, ఒళ్ళు ఓకే..’ అంటూ శ్రీదేవి గ్లామర్ను వర్ణించేలా అదిరిపోయే పల్లవి ఇచ్చారు. అది విన్న ఏఎన్ఆర్ వెంటనే సంతృప్తి చెంది, ఆత్రేయ ప్రతిభను మెచ్చుకున్నారు.