
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటి సావిత్రి పేరు ఒక అద్భుతం. ఆమె అద్భుతమైన నటన, గొప్ప మనసు, మంచికి మారు పేరైన స్వభావం ఎందరినో ఆకట్టుకున్నాయి. తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఆమె జీవితం ఒక ఎమోషన్గా, ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాకుండా, గొప్ప వ్యక్తిత్వంతో అందరి మనసులను దోచుకున్నారు సావిత్రి. అయితే, ఆమె చివరి రోజుల్లో పడిన బాధ, తన జీవితంలోని తప్పిదాలపై ఆమె చేసిన ఆవేదన ఇప్పటికీ ఎందరినో కంటతడి పెట్టిస్తుంది. సావిత్రి తన చివరి మనోవేదనను, జీవితంలోని చేదు నిజాలను తన చిన్ననాటి స్నేహితురాలైన మద్దాలి సుశీలతో పంచుకున్నారు. సావిత్రికి చిన్ననాటి నుంచి ఉన్న ఏకైక స్నేహితురాలు మద్దాలి సుశీల. క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకునే సమయంలో వీరి స్నేహం ప్రారంభమైంది. సినీ రంగంలో సావిత్రి మహానటిగా ఎదుగుతున్న దశలో కూడా ఈ స్నేహం కొనసాగింది.
సావిత్రి సినిమాల్లోకి వెళ్ళేంత వరకు ఆమెతోనే సుశీల ఉంది. ఆ తర్వాత కూడా సావిత్రి, సుశీలను తనతో ఉండాలని ఎంతో కోరుకున్నారు. అయితే, అప్పటికే సుశీలకు పెళ్లి అయ్యింది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. దాంతో సావిత్రితో కలిసి వెళ్ళలేకపోయారు. కానీ, సావిత్రి ఎప్పుడైనా ఊరికి వస్తే కచ్చితంగా సుశీలను కలిసేవారు. లేదంటే తన ఇంటికి పిలిపించుకునేవారు. ఇలా తరచూ వీరిద్దరూ కలుస్తూ వచ్చారు. సావిత్రికి సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నిటినీ సుశీలతో పంచుకునేవారట. తన చివరి రోజుల్లో సుశీలను కలిసినప్పుడు, సావిత్రి తన మనసులోని బాధ మొత్తాన్ని బయటపెట్టారట. తాను ఎలాంటి తప్పు చేశానో అప్పటికే పూర్తిగా గ్రహించి, ఆ ఆవేదనను వెల్లడించారట. తన జీవితాన్ని మార్చేసిన ఒక తప్పు, తనను సుఖం, సంతోషం లేకుండా చేసిందని ఆమె తన స్నేహితురాలితో వాపోయారు. చనిపోవడానికి కొన్నేళ్ల క్రితం, సావిత్రి విజయవాడ వచ్చినప్పుడు ఏలూరులో మెయిన్ రోడ్డు మీద ఉన్న తమ విజయ స్పిన్నింగ్ మిల్ పని మీద అక్కడికి వచ్చారు. అదే సమయంలో సుశీలను కలుసుకున్నారట. ఆ సమయంలో సావిత్రి తన గుండెలోని భారమంతా చెప్పుకున్నారట.
మొదట్లో సుశీల తనతో రాకపోవడంపై కోప్పడ్డానని, కానీ ఆ తర్వాత నువ్వు రాకపోవడమే మంచిదైందని సావిత్రి అన్నారట. “నేను అక్కడికి వెళ్లాను గానీ, కోట్లు సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు. భర్త పట్టించుకోడు. నాకు తోచింది తినలేను, నచ్చింది కట్టుకోలేను. నేను దిక్కుమాలిన దాన్ని అయిపోయాను. నువ్వైనా ఇక్కడ సుఖంగా భర్త పిల్లలతో ఉన్నావు. అంతే చాలు” అని ఎంతో బాధతో చెప్పారట సావిత్రి. ఈ మాటలకు సుశీలకు కన్నీళ్లు ఆగలేదట. జెమినీ గణేశన్తో పెళ్లి వద్దు అని తాను చాలా చెప్పానని, కానీ సావిత్రి వినలేదని, చివరికి ఆమె పరిస్థితి చూసి చాలా బాధేసిందని సుశీల వెల్లడించారు. సావిత్రి ఎంతో సంపాదించారు, ఎందరో అభిమానులను సంపాదించారు. కానీ, చివరికి ఏదీ లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. “ఆ సావిత్రిని ఇలా సినిమా ద్వారా అయినా చూసుకోవడం ఆనందంగా ఉంది” అని సుశీల మహానటి సినిమా విడుదల సమయంలో అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి