
నటుడు రవితేజ మెగాస్టార్ చిరంజీవితో తన ప్రయాణాన్ని విజయవాడలోని విజేత మూవీ ఫంక్షన్ నుండి వివరించారు. ఆ కార్యక్రమం పి.డబ్ల్యు. గ్రౌండ్స్లో జరిగినప్పుడు, రవితేజ ఆలస్యంగా చేరుకుని, చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడలేకపోయారు. ఆ సమయంలో, తనతో పాటు వచ్చిన వారితో ఒకరోజు చిరంజీవి పక్కన కూర్చుంటానని ప్రతినబూనారు. ఆ రోజు నుంచి రవితేజ సినీ ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలో స్నేహితుడి పాత్రలలో నటించిన ఆయన, కొన్ని సంవత్సరాల తర్వాత అన్నయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య చిత్రంలో మరోసారి చిరంజీవితో కలిసి.. ఆయన తమ్ముడిగా.. ఇరువురు హీరోల్లో ఒకరిగా లభించే అవకాశం లభించింది. ఈ ప్రయాణమంతా తనకు ఎంతో గర్వకారణమని రవితేజ పేర్కొన్నారు.
చిరంజీవి తన పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను చూపిస్తారని, తనను ఎంతో ఇష్టపడతారని రవితేజ వెల్లడించారు. విజయవాడలో తాను చేసిన ఆ మాట కంటే కూడా, ఇప్పుడు వారి బంధం ఎంతో సన్నిహితంగా ఉందని ఆయన భావోద్వేగంగా తెలియజేశారు. అప్పుడు పక్కన కూర్చుంటా అని చెప్పానని.. ఇప్పుడు ఏకంగా చంకన ఎక్కే పరిస్థితి ఉందని రవితేజ చమత్కరించారు. కాగా రవితేజ ప్రజంట్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్లో ‘ఇరుముడి(Irumudi)’ అనే సినిమా చేస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. అయ్యప్ప మాల, ఆధ్యాత్మికత, బలమైన ఎమోషనల్ కంటెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.