
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. అలాగే ఫ్యామిలీ హీరోగానూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే గతంలోలా ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేయడం లేదు. విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు రాజశేఖర్. ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న బైకర్ లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గతంలో రాజశేఖర్ చాలా సినిమాలు మిస్ అయ్యారట. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ కూడా రాజశేఖర్ చేయాల్సిందని అయితే కొన్ని కారణాలతో ఆయన మిస్ అయ్యారని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ సీనియర్ నటుడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా, అరవింద స్వామి చేసిన స్టైలిష్ విలన్ పాత్ర గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
‘నాకు విలన్ పాత్రలు చేయాలని ఉంది. అయితే అవి రొటీన్ గా ఉండకూడదు. రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమాలో అరవింద స్వామి పోషించిన విలన్ రోల్ ‘సిద్ధార్థ్ అభిమన్యు’ నాకు చాలా బాగా నచ్చింది. విలన్ అంటే కేవలం అరిచేవాడు కాదు. హీరోకి ధీటుగా తెలివైన వాడు ఉండాలి. అలాంటి పాత్రలు నటనలోని కొత్త కోణాన్ని చూపిస్తాయి, అందకే అప్పట్లో ‘సిద్ధార్థ్ అభిమన్యు’ పాత్రను నేనే చేయాలని అనుకున్నాను. ఈ పాత్ర కోసం నేను అవకాశం అడిగినా సరే ఇవ్వలేదు. నన్ను పెట్టుకుంటే ఖర్చు ఎక్కువవుతుందని.. అరవిందస్వామి అయితే కొన్ని షాట్స్ వాడుకోవచ్చని.. అందుకే నన్ను తీసుకోలేదేమో’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు రాజశేఖర్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఒకవేళ ధ్రువలో అరవింద స్వామి ప్లేస్లో రాజశేఖర్ ఉండి ఉంటే ఎలా ఉండేది? అని అభిమానులు భిన్న రకాలుగా ఊహించుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.