
తమిళ్ సినిమాలతో పాటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహ. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పించారు బాబీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు బాబీ సింహ. అలాగే సలార్ సినిమాలో నటించారు. కాగా బాబీ సింహా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజినీకాంత్ ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారిద్దరి నుంచి కష్టపడే తత్వం, నిబద్ధత నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలని, అలాగే వారు కోట్లాది మంది అభిమానులను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తారని బాబీ సింహ అన్నారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరికీ విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, శైలి ఉన్నాయని, అవి వారిని ప్రత్యేకంగా నిలబెట్టాయని అన్నారు బాబీ. చిరంజీవిగారికి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చినప్పుడు తాను మెసేజ్ చేసి అభినందించగా, చిరంజీవిగారు థాంక్యూ మై బాయ్ అని బదులిచ్చారని బాబీ సింహా సంతోషంగా చెప్పారు.
తెలుగులో అవకాశాల గురించి మాట్లాడుతూ, తాను చాలా చూజీగా ఉంటున్నానని ప్రస్తుతం బిజీగా ఉన్నానని తెలిపారు. రజాకార్ చిత్రంలో రాజిరెడ్డి అనే స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేశానని ఆ పాత్ర తెలంగాణ ఎమోషన్కు దగ్గరైందని అన్నారు. ఈ పాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేసువర్ణావకాశం లభించిందని చెప్పారు. తాను సికింద్రాబాద్లో పుట్టినప్పటికీ, కోయంబత్తూర్లో పెరిగి, మద్రాస్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పుడు పాన్-ఇండియా నటుడిగా మారిన తన ప్రస్థానం ప్రత్యేకమైనదని బాబీ సింహా అన్నారు. రజినీకాంత్ లాగే తాను వివిధ ప్రాంతాల నుండి వచ్చి చిత్రసీమలో స్థిరపడ్డానని తెలిపారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా సింపుల్గా, నిరాడంబరంగా ఉంటారని, కానీ ఆయన విజువలైజేషన్ మాత్రం అద్భుతమని కొనియాడారు. సెట్లో చిన్న నటులు తప్పు చేసినప్పుడు కూడా ప్రశాంత్ నీల్, శంకర్ వంటి దర్శకులు కోపగించుకోకుండా, స్వయంగా వెళ్లి వివరించి చెబుతారని, ఇది వారి గొప్ప గుణమని బాబీ సింహా ప్రశంసించారు. అలాగే కమలహాసన్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక ప్రపంచ స్థాయి నటుడు, సాంకేతిక నిపుణుడు అని అన్నారు. 24 క్రాఫ్ట్స్లో ఆయనకు తెలియనిది ఏమీ ఉండదని, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి కమలహాసన్ అని బాబీ సింహ అన్నారు. విశ్వరూపం సినిమా విడుదల సమయంలో కమలహాసన్ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనను, అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కమలహాసన్ కమర్షియల్ సినిమాల వైపు కాకుండా తనదైన ప్రత్యేక శైలిలో సినిమాలు చేస్తారని, చిరంజీవి, రజినీకాంత్ లాగే కమలహాసన్ కూడా ఒక ప్రత్యేకమైన నటుడని, ఆయనకు సాటి మరొకరు లేరని బాబీ సింహా అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..