
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు వింటేనే ఒళ్లు పులకరిస్తుంది. ఒకరు మాస్ మంత్రానికి కేరాఫ్ అడ్రస్, మరొకరు గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్కు కేరాఫ్ అడ్రస్. ఆ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. సీనియర్ హీరో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి నేటి తరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే.. ఒక స్టార్ డైరెక్టర్ తెలుగు తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలని చూశారు. నటసింహాన్ని, సూపర్ స్టార్ని అన్నదమ్ములుగా చూపిస్తూ ఒక భారీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను ప్లాన్ చేశారు. ఆ సినిమా గనుక పట్టాలెక్కి ఉంటే టాలీవుడ్ రికార్డులన్నీ గాలిలో కలిసిపోయేవి. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయాలని చూసిన ఆ దర్శకుడు ఎవరు? ఆ భారీ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం..
నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చిన దర్శకుల్లో బి.గోపాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు టాలీవుడ్ ట్రెండ్ను మార్చేశాయి. ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ నుంచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వరకు వీరి బాండ్ ఎంతో స్ట్రాంగ్. బాలయ్య బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను డిజైన్ చేయడంలో గోపాల్ దిట్ట. అయితే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ పరాజయం పాలవ్వడంపై ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. అయినప్పటికీ బాలయ్యతో ఆయనకున్న అనుబంధం విడదీయలేనిది.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి.గోపాల్ ‘వంశీ’ అనే సినిమా చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, మహేష్ వ్యక్తిగత జీవితంలో ఇది చాలా ప్రత్యేకం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రతా శిరోద్కర్, మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లి నేడు వారు ఒక అద్భుతమైన జంటగా నిలిచారు. మహేష్ కెరీర్లో ఈ సినిమా ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ గోపాల్తో మహేష్ పనిచేయలేదు.
బాలయ్య, మహేష్ బాబు.. ఈ ఇద్దరు స్టార్లతో ఒకే సినిమాలో మల్టీస్టారర్ ప్లాన్ చేశారు బి.గోపాల్. అన్నదమ్ముల మధ్య ఉండే సెంటిమెంట్, దానికి తోడు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారట. బాలయ్య అన్నగా, మహేష్ బాబు తమ్ముడిగా నటిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఆయన నమ్మారు. దీని కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఒకవేళ ఈ సినిమా వచ్చి ఉంటే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ కంటే ముందే ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రికార్డుల్లో నిలిచిపోయేది.
ప్రస్తుతం బాలయ్య బాబు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. 65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు. రీసెంట్గా వచ్చిన ‘అఖండ’ పర్వాలేదనిపించినా, ఆయన జోరు మాత్రం తగ్గలేదు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నారు. రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో మహేష్ నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. 2027లో రాబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, మహేష్ బాబు ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలని ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. బి.గోపాల్ కన్న ఆ కల ఎప్పటికైనా నిజమవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.