
ఇటీవల సుధా మీనన్ నిర్వహించిన ‘సెకండ్ సన్రైజ్’ పాడ్కాస్ట్లో సుహాసిని తన ఫిట్నెస్ రొటీన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె కేవలం జిమ్ వర్కవుట్లకే పరిమితం కాకుండా, విభిన్నమైన నృత్య రీతులతో తన శరీరాన్ని, మనసును ఉత్సాహంగా ఉంచుకుంటున్నారు. 63 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
తన ఫిట్నెస్ గురించి సుహాసిని మాట్లాడుతూ.. “నేను జుంబా చేస్తాను, సల్సా చేస్తాను. అంతేకాకుండా 63 ఏళ్ల వయసులో ఇప్పుడే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను” అని తెలిపారు. ఆమె ఉత్సాహాన్ని చూసి గురువు గారు ‘అరంగేట్రానికి సిద్ధమా?’ అని అడిగితే.. “లేదు, నేను ప్రేక్షకుల కోసం నృత్యం చేయడం లేదు.. నా కోసం నేను ఆడుతున్నాను” అని ఆమె ఎంతో వినమ్రంగా సమాధానం ఇచ్చారు. ఇతరుల మెప్పు కోసం కాకుండా, తన ఆత్మసంతృప్తి కోసం ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. ఏదైనా కళను నేర్చుకోవడానికి లేదా వ్యాయామం చేయడానికి వయసు అస్సలు అడ్డంకి కాదని ఆమె చాటి చెప్పారు.
వయసు పెరిగిన కొద్దీ శరీర కదలికలు అత్యంత అవసరం. వయసు అనేది ఒక పరిమితి కాదు. డ్యాన్స్ వంటి ప్రక్రియలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు మరియు ఆత్మవిశ్వాసానికి తోడ్పడతాయి. పెద్ద వయసులో కొత్తగా ఇటువంటివి ప్రారంభించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని, తీవ్రత కంటే నిలకడ , భద్రతపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పద్ధతిలో చేస్తే ఎంతటి కఠినమైన కళనైనా ఏ వయసులోనైనా ఆస్వాదించవచ్చని అంటున్నారు.
పెద్ద వయసులో నృత్యం చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా, శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. దీనివల్ల వయసు రీత్యా వచ్చే కింద పడిపోయే ప్రమాదాలు తగ్గుతాయి. సుహాసిని మణిరత్నం పాటిస్తున్న ఈ జీవనశైలి వల్ల ఆమె ఎప్పుడూ చురుగ్గా కనిపిస్తున్నారు. శారీరక శ్రమను ఒక భారంగా కాకుండా, ఒక ఇష్టమైన కళగా మార్చుకుంటే ఆరోగ్యం వాటంతట అదే సిద్ధిస్తుందని ఆమె ప్రయాణం మనకు నేర్పుతుంది. మీరు కూడా మీ కిష్టమైన ఏదైనా కొత్త పనిని నేర్చుకోవడానికి ఇప్పుడే పునాది వేయండి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.