K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి చెప్పక్కర్లేదు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన పేజీ లిఖించారు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుధీర్ఘ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
Raghavendra Rao

Updated on: Jul 30, 2026 | 11:04 PM

సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, అద్భుతమైన దర్శకత్వ శైలి, దివంగత నటి శ్రీదేవితో తనకున్న మధురమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు పాటల దర్శకుడిగా పేరు రావడంపై ఆయన స్పందిస్తూ, జ్యోతి, దేవత, బొబ్బిలి బ్రహ్మన్న, అన్నమయ్య వంటి ఎన్నో ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాలు తీశానని, అయినా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే, పాటల్లోని కొన్ని ఫ్రేమ్‌లు, వస్తువుల వాడకం ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోతాయని అన్నారు.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైన జ్యోతి, ఆమె కథ, అమరదీపం వంటివి తీసిన తర్వాత, అదే జానర్‌లో తొందరపడకుండా అడవి రాముడు లాంటి మాస్ కమర్షియల్ సినిమా కోసం వేచి చూశానని రాఘవేంద్ర రావు తెలిపారు. ఎన్టీఆర్ వంటి లెజెండరీ నటుడితో అడవి రాముడు తీయడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని, ఆ చిత్రం అప్పట్లో నాలుగు కోట్లు వసూలు చేసిందని, అది ఇప్పటి ఐదు వేల కోట్లతో సమానమని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను ఏనుగుపై ప్రవేశపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించారు. అటవీ అధికారిగా ఆయన నిజాయితీని చూపించే క్రమంలో, రొమాన్స్‌కు ఆస్కారం ఉండదని భావించి, అడవిలోకి మామూలు మనిషిగా వచ్చి గిరిజనులను కలిసే సన్నివేశాన్ని రూపొందించినట్లు చెప్పారు. సినిమా విడుదలకు ముందు టెన్షన్‌గా ఉన్నప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాటను క్రియేట్ చేసి రామారావు గారి గొప్పదనాన్ని తెలియజేశానని, చివరి షాట్‌లో రాముడిలా చూపించడం తన కోరిక అని వివరించారు. ఎన్టీఆర్ అడవి రాముడు చిత్రీకరణ తర్వాత తనతో 12 సినిమాలు చేశారని, అందులో తొమ్మిది, పది హిట్‌లే అని గర్వంగా చెప్పారు.

చిరంజీవితో 14 చిత్రాలు, రామారావు, బాలకృష్ణ, తారక రత్న వంటి మూడు తరాల నటులతో, అలాగే నాగేశ్వర రావు, నాగార్జున, సుమంత్; కృష్ణ, మహేష్ బాబు వంటి ప్రముఖ నటులతో పని చేసిన అరుదైన అవకాశం తనకు లభించిందని తెలిపారు. “నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన వద్దులేండి అనలా” అని చెప్పారు.

దివంగత నటి శ్రీదేవితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఊరికి మొనగాడు తెలుగులో కృష్ణతో సూపర్ హిట్‌ అయిందని, దానిని చూసి జితేంద్ర హిందీలో శ్రీదేవితో సినిమా చేయమని అడిగాడని చెప్పారు. 16 ఏళ్ళ వయసు తెలుగులో విజయవంతమైనప్పటికీ, హిందీలో శ్రీదేవి నటించిన సోల్వా సావన్ ఆడలేదని గుర్తుచేసుకున్నారు. శ్రీదేవితో 24 చిత్రాలు చేశానని, ఆమె చివరి చిత్రం మామ్ ఆడియో ఫంక్షన్‌కు తనను చీఫ్ గెస్ట్‌గా పిలిచి, 25వ చిత్రం కూడా తనతో చేయాలని కాళ్ళకు నమస్కారం చేసిందని భావోద్వేగంగా వెల్లడించారు. “ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళింది. అతిలోకసుందరి దేవలోకానికే వెళ్ళిపోయింది,” అంటూ శ్రీదేవి మరణం పట్ల తన ప్రగాఢ విచారాన్ని తెలియజేశారు. ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలు అద్భుతమని, అలాంటి మరణం ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Loading...
Unable to load recommendations.
Follow Us