
కడప జిల్లాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సందడి చేశారు. రాజంపేట మండల పరిధిలోని రోళ్లమడుగు శేషాచలం అడవుల్లో ధనుష్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ అప్డేట్ తెలియడంతో స్థానిక ప్రజలు, సినిమా అభిమానులు షూటింగ్ స్పాట్కు మరియు ధనుష్ బస చేసిన ప్రాంతానికి భారీగా క్యూ కట్టారు. రాజంపేట – రాయచోటి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్ పరిధిలోని దట్టమైన శేషాచలం అడవులు ఎర్రచందనానికి ప్రపంచ ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న ఈ సినిమా కథ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లోనే సాగుతుందని సమాచారం. అందులో భాగంగానే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను, టాకీ పార్ట్ను ఈ రోళ్లమడుగు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.
చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘంగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల పాటు అడవుల్లో హై-వోల్టేజ్ సీన్ల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.సినిమా షూటింగ్ నిమిత్తం హీరో ధనుష్ రాజంపేటలోని ఒక ప్రముఖ లాడ్జిలో బస చేశారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో దావాగ్నిలా వ్యాపించడంతో తమ అభిమాన హీరోను ఒక్కసారైనా కళ్లారా చూడాలనే ఆరాటంతో స్థానిక ప్రజలు, యువకులు లాడ్జి వద్దకు భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ తాకిడి పెరగడంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ కంప్లీట్ చేసిన ధనుష్, మరో రెండు రోజుల పాటు రాజంపేటలోనే బస చేసి మిగిలిన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేయనున్నారు. శేషాచలం అడవుల బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులలో సరికొత్త అంచనాలను రేకెత్తిస్తోంది.