
సగటు భారతీయ విద్యార్థి ఒత్తిడిని, కలలను, కార్పొరేట్ విద్యావ్యవస్థపై విమర్శను అత్యంత హాస్యభరితంగా, హృదయపూర్వకంగా చెప్పిన సినిమా ‘3 ఇడియట్స్’. 2009లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్.. కేవలం బాక్సాఫీస్ వద్దనే కాదు, సామాజికంగా కూడా గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ సినిమా విడుదలైన పదిహేను సంవత్సరాల తర్వాత, ‘రాంచో’, ‘ఫర్హాన్’, ‘రాజు’, ‘పియా’లను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం, ‘3 ఇడియట్స్’ సీక్వెల్ అధికారికంగా ఖరారైంది! ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒరిజినల్ టీమ్ అంతా తిరిగి రాబోతోంది. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి వంటి ప్రధాన నటీనటులంతా మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా, తొలి భాగాన్ని రూపొందించిన అద్భుతమైన దర్శకుడు రాజ్కుమార్ హిరాణీనే ఈ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారు.
దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయింది. 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘3 ఇడియట్స్’ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా హిరాణీ ఈ స్క్రిప్ట్ను రూపొందించారని తెలుస్తోంది. ఈ భారీ సీక్వెల్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. సీక్వెల్ కథ, తొలి భాగంలోని క్లైమాక్స్ తర్వాత దాదాపు 15 సంవత్సరాల కాలంలో వారి జీవితాలు ఎలా మారాయి అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు మళ్లీ ఒక కొత్త సాహసం కోసం కలుసుకుంటారు.
3 Idiots
దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ మొదట్లో ఆమిర్ ఖాన్తో కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్పై పనిచేయాలని అనుకున్నారు. కానీ, ఆ స్క్రిప్ట్పై సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీంతో, హిరాణీ తన దృష్టిని పూర్తిగా ‘3 ఇడియట్స్ 2’ స్క్రీన్ప్లేను పూర్తి చేయడంపై కేంద్రీకరించారు. ఈ కథ ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా, ఒరిజినల్ సినిమా స్థాయికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంత కాలం వేచి చూశారట.
ఆమిర్ ఖాన్, కరీనా, మాధవన్, శర్మన్ జోషి, రాజ్కుమార్ హిరాణీ వంటి దిగ్గజాలు ఈ సీక్వెల్ కోసం పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటి కావడంతో ‘3 ఇడియట్స్ 2’ ఈ దశాబ్దంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా మారింది. రాజ్కుమార్ హిరాణీ ఈ సినిమాలో ఏ అంశం మీద ఫోకస్ చేయనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!