నిన్న పుష్ప2, నేడు యానిమల్.. ఇండియన్ సినిమాలకు జపాన్లో పెరుగుతున్న క్రేజ్
ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూలు చేసిందనే దానికంటే.. ఎన్ని చర్చలకు దారితీసిందనేది ఈ కాలంలో చాలా ముఖ్యం. ఆ దర్శకుడి పేరు చెబితేనే ఇండస్ట్రీలో ఒక ప్రకంపన మొదలవుతుంది. ఆయన తీసిన మొదటి సినిమానే ఒక ట్రెండ్ సెట్టర్.

ఇక రెండో సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులను తిరగరాశారు. అయితే ఆ సినిమా కథ విన్నప్పుడు స్టార్ హీరో కూడా వణికిపోయారట. అంతటి భయంకరమైన, హింసాత్మకమైన పాత్రను తను చేయగలనా? లేదా? అని సందేహించారట. కానీ దర్శకుడు మాత్రం తన విజన్ మీద నమ్మకంతో ఆ హీరోనే ఒప్పించి, వెండితెరపై ఒక ‘యానిమల్’ లా మార్చేశారు. 2023 చివరలో భారత్లో విధ్వంసం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు మరో దేశంపై దండయాత్రకు సిద్ధమైంది. సముద్రాలు దాటి వెళ్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలేంటి? ఆ హీరో పంచుకున్న ఆసక్తికరమైన భయాలు ఏంటి?
జపాన్లో ‘యానిమల్’..
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సత్తా ఏంటో ‘అర్జున్ రెడ్డి’తోనే ప్రపంచానికి తెలిసింది. అదే సినిమాను ‘కబీర్ సింగ్’గా హిందీలో తీసి అక్కడ కూడా బాక్సాఫీస్ షేక్ చేశారు. ఇక రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా ఆయన తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 2023 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జపాన్ ప్రమోషన్లలో పాల్గొన్న రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రణ్బీర్ తన మనసులో మాటను బయటపెట్టారు. “గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలే చేశాను. కానీ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. ఇందులో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. నేను దీనికి న్యాయం చేయగలనా అని సందేహం కలిగింది. కానీ సందీప్ నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాను” అని రణ్బీర్ వివరించారు.
ఈ సినిమాలో హింస కంటే ఎక్కువగా తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తనకు బాగా నచ్చిందని రణ్బీర్ చెప్పారు. “రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉన్నా, అతడిలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్లే తత్వం ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. నా జనరేషన్లోని అందరి ఇంట్లో తండ్రీకొడుకుల మధ్య ఒక రకమైన దూరం ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్గా తండ్రితో ఉండలేము. అదే పాయింట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది” అని ఆయన చెప్పుకొచ్చారు.
పట్టుదలతో సాధించిన సందీప్..
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ కథ రాసుకుంటున్నప్పుడే రణ్బీర్ కపూర్ను హీరోగా ఫిక్స్ అయిపోయానని తెలిపారు. “రణ్బీర్కు ఇది చాలా కొత్త తరహా పాత్ర. అందుకే మొదట్లో భయపడి కొంచెం టైమ్ తీసుకున్నాడు. కానీ తను తప్ప ఈ పాత్రను మరెవరూ చేయలేరని నేను నమ్మాను. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులు కూడా ఈ ఎమోషన్కు కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను” అని సందీప్ అన్నారు. ఈ క్రమంలోనే ‘యానిమల్’ సీక్వెల్గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ 2028లో విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. జపాన్ బాక్సాఫీస్ వద్ద యానిమల్ ఏ రేంజ్ లో గర్జిస్తుందో చూడాలి. రణ్బీర్ కపూర్ భయాన్ని పోగొట్టి అతడిలోని విశ్వరూపాన్ని బయటకు తీసిన సందీప్ రెడ్డి వంగా విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
