ఆర్థిక సంక్షోభంలో దేశంలో తొలి మెట్రో…
ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో వైరస్ వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలకు పైబడి మెట్రో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత మార్చి 22 నుంచి మెట్రో మూతబడటంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని..
ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో వైరస్ వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలకు పైబడి మెట్రో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత మార్చి 22 నుంచి మెట్రో మూతబడటంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, రుణాన్ని చెల్లించడానికి డీఎంఆర్సీ దగ్గర నిధులు లేనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మెట్రో సంస్థనే స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఆర్థిక సహాయం చేయాలని కోరింది.
ఢిల్లీ మెట్రో రైలు పథకం కోసం జపాన్ కంపెనీ జికా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) నుంచి కేంద్రం రూ. 35,198 కోట్ల రుణం తీసుకుంది. డీఎంఆర్సీ కార్యకలాపాలు ప్రారంభమైన 2002 సంవత్సరం నుంచి మెట్రో ఈ వాయిదాలను స్వయంగా చెల్లిస్తోంది. ఢిల్లీ మెట్రో కార్యకలాపాలతో వచ్చే లాభాల నుంచి రుణ వాయిదాలను ఇంతవరకూ చెల్లిస్తుండగా,..2020-21లో ఢిల్లీ మెట్రో మొత్తం రూ. 1242 కోట్లకు పైగా మొత్తం చెల్లించాలి. ఇందులో రూ. 434.15 కోట్ల వడ్డీ, కాగా, రూ. 808.68 కోట్ల అసలు ఉన్నాయి. ఇప్పటివరకు మొదటి త్రైమాసికం పూర్తయిన తరువాత మెట్రో కేవలం రూ. 79.19 కోట్లు మాత్రమే చెల్లించింది. రుణం తీర్చేందుకు తమ వద్ద నిధులు లేవని మెట్రో కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.
కాగా ఢిల్లీ మెట్రో నిలిచిపోయన కారణంగా మెట్రోకు రోజుకు సుమారు రూ. 10 కోట్ల రూపాయలు నష్టం వస్తోంది. లాక్డౌన్కు ముందు మెట్రోలో ప్రతి రోజూ 28 లక్షలకు పైగా ప్రజలు ప్రయాణించేవారు. అయితే, గత 18 ఏళ్లలో రుణాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ మెట్రో అధికారులు.