Crime News: విజయనగరంలో దారుణం.. పోలీసునని బెదిరించి, ఇద్దరు గిరిజన బాలికలపై అఘాయిత్యం!

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగుడు.

Crime News: విజయనగరంలో దారుణం.. పోలీసునని బెదిరించి, ఇద్దరు గిరిజన బాలికలపై అఘాయిత్యం!

Updated on: Jan 02, 2022 | 10:26 AM

Vizianagaram district Atrocities: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగుడు. న్యూఇయర్ వేడుకలు జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు బాలికలను దారిలో అడ్డగించిన కామాంధుడు.. పోలీసునని బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. నిన్న మద్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చి రేగటి గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో.. రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు అడ్డుకున్నాడు. యువతుల వాహనాన్ని అడ్డుకున్న అతడు పోలీసునంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు యువతులిద్దరూ బెంబేలెత్తిపోయారు. తాను చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ చేస్తానని బెదిరించిన దుండగుడు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని వదిలిపెట్టాడు. దీంతో ఇంటికి చేరుకున్న యువతులు తమపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతుల నుండి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

యువతులు ఇచ్చిన సమాచారం మేరకు అఘాయిత్యానికి పాల్పడిన నకిలీ పోలీస్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరాన్ని అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

Read Also… Post Office scheme: పోస్టాఫీసు పొదుపు పథకాలలో సరికొత్త ఆఫర్.. పన్ను మినహాయింపుతో డబ్బు రెట్టింపు..!