Two Children Missing: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా బయటకు వెళ్లిన పిల్లలు కనిపించకపోవడంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలాయగూడెనికి చెందిన ఇద్దరు బాలురు స్థానికంగా ఆరోతరగతి చదువుతున్నారు. వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలు. యశ్వంత్ తండ్రి సురేష్, అభి తండ్రి అగస్తిన్ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి శత్రువులు ఎవరూ లేరు. అయితే ఇద్దరు పిల్లలు శనివారం సాయంత్రం ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని బయటికి వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పరిసరాలు మొత్తం గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కంగారు పడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.