Telangana: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం.. అర్ధరాత్రి కాపాడాలంటూ..

|

Jun 27, 2022 | 6:57 AM

వేల్పూరు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డుపై ఆగివున్న లారీని.. జగిత్యాల వైపు నుంచి ఆర్మూర్ వైపు వెళ్లున్న ఆల్టో కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Telangana: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం.. అర్ధరాత్రి కాపాడాలంటూ..
representative image
Follow us on

Road accident in nizamabad: తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. జిల్లాలోని వేల్పూరు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డుపై ఆగివున్న లారీని.. జగిత్యాల వైపు నుంచి ఆర్మూర్ వైపు వెళ్లున్న ఆల్టో కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు.. తమను రక్షించాలంటూ కేకలు వేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. హుటాహుటీనా భీంగల్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అప్పటికే కారుతో సహా ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. సంఘటనా స్థలంలో దొరికిన కారు నెంబర్ ఆధారంగా వేల్పూరు ఎస్ఐ వినయ్ మృతుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై వేల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..