Parents Starved Death in Suryapet District: తల్లిదండ్రుల ఆకలి చావులకు కారణమైన కుమారుడు, కోడలు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. కరోనా టైంలో వృద్ధుల ఆకలి చావు అన్న వార్త అప్పట్లో ఎంత సంచలనమో ఇప్పుడు వాళ్ల అరెస్టు కూడా అంతే సంచలనంగా మారింది.
సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెంలో సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చావుకు కారణమైన కొడుకు, కోడలు అరెస్ట్ సంచలమైంది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఆదరించకుండా భోజనం,నీళ్లు ఇవ్వకుండా ప్లాస్టిక్ పట్టాలతో కట్టిన షెడ్ లోఉంచిన కొడుకు, కోడలు బ్రతికి ఉండగానే నరకం చూపించారు. అస్తులు అంతస్తులు సంపాదించి కన్నపిల్లలకు పంచి ఇచ్చిన చివరికి ఆకలితో అలమటించి గత నెల 27న వృద్ధ దంపతులు రామచంద్రారెడ్డి, అనసూర్య మృతి చెందారు.
దీంతో గుట్టు చప్పుడు కాకుండా వృద్దుల భౌతికకాయాలను కొడుకు ఖననం చేశాడు. వృద్ధ దంపతులు ఒకేసారి చనిపోవడంతో కూతురు, గ్రామస్తులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్దుల మృతిపై కూతురు, గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు పోలీసులు. ఖననం చేసిన శవాలకు రీ పోస్టుమార్టం నిర్వహించారు. వృద్ధ దంపతుల చావుకు కొడుకు, కోడలు నిర్లక్ష్యమే కారణమని తేల్చిన పోలీసులు.. కొడుకు నాగేశ్వర్రెడ్డి, కోడలు లక్ష్మిలను అరెస్టు చేశారు.
పున్నామినరకం నుంచి తప్పించాల్సిన కుమారుడు ఇలా ఆకలితో చంపేయడం అప్పట్లో తీవ్ర ఆరోపణలకు కారణమైంది. కరోనా టైంలో వాళ్ల దీన స్థితి చూసి చాలా మంది వెళ్లేందుకు సాహంచలేదు. ఈ క్రమంలోనే ఆ వృద్ధులు చనిపోయారు. తర్వాత ఇది ప్రసార మాధ్యమాల్లో రావడం… గ్రామస్థులు రియాక్టై కేసులు పెట్టారు. ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా పోలీసులు మంచి పని చేశారన్న వాదన గ్రామంలో వినిపిస్తోంది. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అభినందిస్తున్నారు.