PhD Holder Cheating : పీహెచ్‌డీ చేసి.. నలుగురు తోపుగాళ్లకి ఉద్యోగాలిచ్చి.. 500 మంది @ 7 కోట్లు, కట్ చేస్తే కటకటాలు

|

Mar 27, 2021 | 6:32 PM

PhD Holder Jobs Cheating :ఎంబీఏ చేశాడు. ఆపై హ్యూమన్ రిసోర్సెస్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. పలు ప్రముఖ విద్యాసంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసి చివరికి..

PhD Holder Cheating : పీహెచ్‌డీ చేసి.. నలుగురు తోపుగాళ్లకి ఉద్యోగాలిచ్చి.. 500 మంది @ 7 కోట్లు, కట్ చేస్తే కటకటాలు
Follow us on

PhD Holder Jobs Cheating :ఎంబీఏ చేశాడు. ఆపై హ్యూమన్ రిసోర్సెస్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. పలు ప్రముఖ విద్యాసంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసి చివరికి ఒక కాలేజీని స్థాపించాడు. అయితే, ఆ కళాశాల నష్టాల్లో కూరుకుపోవడంతో మాస్టర్ ప్లాన్ గీశాడు. సక్సెస్ అయ్యాడు. దాదాపు 8కోట్లకు కుచ్చుటోపీ పెట్టేశాడు. అదీ.. ఒకరిద్దరి దగ్గర్నుంచి కాదు, ఏకంగా ఐదొందలమందికి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చిమరీ. అతనెవరంటే.. 44 ఏళ్ల మనోజ్ హోటా. వ్యవహారం నడిపింది రాజధాని హస్తినలో, కట్ చేస్తే కటకటాలు.

పీహెచ్‌డీ హోల్డర్ మనోజ్ హోటా సహా మొత్తంగా ఐదుగుర్ని ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసగించి ₹ 7.5 కోట్లు కొట్టేశారని అభియోగాలు మోపారు. వీరి ఇల్లీగల్ దందాలో 500 మందిని మోసగించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే, విద్యావంతుడైన హోటా ఎలాగైనా డబ్బు సంపాదించాలని తలంచి ప్రజలను ఈజీగా మోసగించడానికి వీలుగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగే నలుగురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులను రిక్రూట్ చేసుకున్నాడు. ఇలా ఉద్యోగాల్లో చేరిన వారిలో ఆశిష్ రంజన్ (26), అభిషేక్ కుమార్ (27) తదితరులున్నారు.

బహుళ జాతీయ సంస్థల పేరిట అనేక నకిలీ వెబ్‌సైట్లు, ఈమెయిల్ ఐడిలను సృష్టించిన హోటా, వాటి నిర్వాహకులుగా రిక్రూట్ చేసుకున్న వాళ్లని నియమించాడు. ఆపై, రంగంలోకి దిగి పనిమొదలెట్టిన హోటా టీం.. టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ ప్రకటనలిచ్చారు. ఆపై ఎంపిక ప్రక్రియ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి వివిధ కారణాలను పేర్కొంటూ నిరుద్యోగుల నుంచి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకున్నారు.

ఇలా దాదాపు 500 మంది నుంచి 7.5 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (సైబర్ సెల్) అన్యేష్ రాయ్ చెప్పారు. వీళ్ల చేతిలో దాదాపు 20 లక్షల రూపాయలు మోసపోయిన ఉత్తమ్ నగర్ నివాసి నుండి పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై నజర్ పెట్టిన పోలీసులు చీటింగ్ బ్యాచ్ అంతా గుర్గావ్‌ కేంద్రంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఒక్కసారిగా వాళ్ల అక్రమ కాల్‌సెంటర్‌ బృందంపై దాడి చేశారు పోలీసులు. సూత్రధారి మనోజ్ హోటాతో సహా ఐదుగురిని స్పాట్ లో అరెస్టు చేశారు. హోటా, రంజన్, కుమార్‌తో పాటు సోను రావల్ (29), షేక్ పింటు అలీ (28) లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏడు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, 14 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.

Read also :

Ramcharan Jani Master couple : చరణ్ బర్త్ డే సందర్భంగా సతీసమేతంగా రక్తదానం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దంపతులు