Islamic State Commander Killed: ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ను తమ దేశ భద్రతా బలగాలు మట్టుబెట్టాయని ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్ కదిమి వెల్లడించారు. ఉత్తర ఇరాక్లోని నిఘా విభాగం నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్లో ఐసిస్ ఇరాక్ చీఫ్ అబు యాసిర్ అల్ ఇన్సానీ మృతిచెందినట్లు కదిమి పేర్కొన్నారు. బాగ్దాద్లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాల్లో ఈ నెల 21న పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 32 మంది మృతిచెందారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహించినట్లు ఇస్లాస్మిక్ స్టేట్ ఉగ్రసంస్థ వెల్లడించింది. పేలుళ్లపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన ఇరాక్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అబు యాసిర్ అల్ ఇన్సానీ మరణించినట్లు సైనికాధికారులు వెల్లడించారు.