Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..

|

Jul 29, 2021 | 4:39 PM

మాకు రేషన్‌ కార్డులు రాలేదని చెప్పుకుంటే.. అక్కడ మేయర్‌ కుర్చిలో కూర్చున్న వ్యక్తి.. ఒక్కసారిగా లేచి బాధితురాలి చెంప చెళ్లు మనిపించాడు.

Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..
Meerpet Mayor's Husband
Follow us on

ఓ స్థానిక నేత బరితెగించాడు.. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మున్సిపల్ ఆఫీస్‌కు గోడు వెల్లబోసుకునేందుకు స్థానికులు వెళ్లారు. మాకు రేషన్‌ కార్డులు రాలేదని చెప్పుకుంటే.. అక్కడ మేయర్‌ కుర్చిలో కూర్చున్న వ్యక్తి.. ఒక్కసారిగా లేచి బాధితురాలి చెంప చెళ్లు మనిపించాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

ప్రజాప్రతినిధులు అంటే…ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ప్రజలకు…పాలకులకు మధ్య వారధిగా ఉన్న స్థానిక నేతలను కలుపుకొని పోవాలి. మరి అక్కడ అలా జరగడం లేదు. ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపైనే దౌర్జన్యం చేయడం… తన్ని తరిమేస్తున్నారనే విమర్శలున్నాయి. సాక్షాత్తు మేయర్‌ భర్తే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించడం వివాదానికి కారణమైంది.

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలు వచ్చారు. అక్కడ మేయర్ ఉండాల్సిన చోటు మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అమాయకంగా ఆ మహిళ తనకు రేషన్ కార్డు రాలేదని, తనకు రేషన్ కార్డు ఇప్పించాలని వేడుకుంది. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి, వెళ్లిపోవాలంటూ హుకుం జారి చేశాడు అక్కడున్న వ్యక్తి.. అంతటితో ఆగలేక.. మేయర్‌ కుర్చిలో కూర్చున్న వ్యక్తి.. ఒక్కసారిగా లేచి బాధితురాలి చెంప చెళ్లు మనిపించాడు. స్థానికులపై చేయి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు…సాక్షాత్తు మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ భర్త లాల్ చౌహన్. మేయర్ ఛాంబర్లో దర్జాగా కూర్చోవడమే కాకుండా….స్థానిక ప్రజలు తమ సమస్యలను మేయర్‌తో చెప్పుకునేందుకు వస్తే నోటికొచ్చినట్లుగా తిట్టాడు. అంతటితో ఆగకుండా.. మేయర్‌ ఆఫీస్‌కు రారు.. మీకు ఏమైనా అవసరమైతే ఆమె ఇంటికి వెళ్లండి అంటూ రుబాబుగా చెప్పాడు లాల్ చౌహాన్.

గత కొద్ది రోజులుగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాల్లో మేయర్ భర్త లాల్‌ చౌహన్ జోక్యం పెరిగింది. డైరెక్టుగా ఆఫీసులోనే.. మేయర్‌ కుర్చిలో కూర్చొని.. ఇలా దౌర్జన్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు…చివరకు వార్డు కార్పోరేటర్లు వెళ్లినా…లెక్క చేయరని.. కనీసం సమస్యలు ఆలకించడని అంటున్నారు.

స్థానిక సమస్యలపై స్పందించాల్సిన స్థాయి ఆయనకు లేదు. భార్య స్థానంలో కూర్చున్న వ్యక్తి అంతే హుందాగా వ్యవహరించాలి. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. కాని ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా పొగరుగా సమాధానం చెప్పడం సరికాదని…ఇలాంటి వాళ్లను కాస్త కంట్రోల్ చేస్తే మంచిదని స్థానికులు కోరుతున్నారు.

Read Also…  

Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్‌కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత కేటీఆర్