Fake Challans: ప్రైవేటు దోపిడీ ప్రభుత్వం సీరియస్.. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సోదాల్లో వెలుగులోకి సంచలనాలు..!

|

Aug 12, 2021 | 7:27 PM

ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు పక్కాదారి పట్టాయి. సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకున్న కేటుగాళ్లు నకిలీ ఈ-చలానాల ద్వారా దారి మళ్లిస్తున్నారు.

Fake Challans: ప్రైవేటు దోపిడీ ప్రభుత్వం సీరియస్.. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సోదాల్లో వెలుగులోకి సంచలనాలు..!
Ap Sub Registrar's Office
Follow us on

AP Sub-Registrar’s office: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు పక్కాదారి పట్టాయి. సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకున్న కేటుగాళ్లు నకిలీ ఈ-చలానాల ద్వారా దారి మళ్లిస్తున్నారు. కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆరు నెలల క్రితం ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో పనిచేసిన ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌‌తో కుమ్మక్కైన అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించాడని గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు ముమ్మరం చేశారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల సాయంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌, ఈ-చలానా, ఈ.సీ, ఆర్‌హెచ్‌, నకళ్లు, మార్కెట్‌ వాల్యూస్‌ వంటి పనులను సీనియర్‌ అసిస్టెంట్లు చేయాల్సి ఉంది. ఈ పనులను కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు పంచుకుంటున్నారు. ఇదే అదనుగా జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో దందాలు నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి చేరాల్సిన స్టాంప్‌ డ్యూటీ సొమ్మును నకిలీ ఈ-చలానా ద్వారా జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు కొందరు సబ్‌ రిజిస్ర్టార్ల మద్దతు ఉండటంతో బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేట్‌ ఉద్యోగులకు, కొందరు సీనియర్‌ అసిస్టెంట్లకు వారం, నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నారు. ఈ అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ర్టార్లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు, కల్లూరు, నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో జూన్‌, జూలై నెలల్లో సర్వర్లు మొరాయించాయి. సరిగ్గా ఇదే సమయంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఈ-చలానాల దోపిడీకి తెరతీశారని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నకిలీ చలానాల దందా గుంటూరు జిల్లాలోనూ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని ..ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని ..ఈతరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు అధికారులు.

ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు సుమారు రూ.8లక్షలు రికవరీ చేసుకున్నారు అధికారులు. సబ్‌ రిజిస్ట్రార్ రాధాకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు…కొంతమంది డాక్యుమెంట్ రైటర్లని విచారిస్తున్నారు. డాక్యుమెంట్ల ప్రకారం 2లక్షల 15వేలు చెల్లించాల్సి ఉండగా..సీఎఫ్‌ఎంఎస్‌లో 15వేలు చలానా తీసి…దాని ప్రింట్‌ అవుట్‌లో ముందు రెండు అక్షరం యాడ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు మోసానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

Read Also…  Balineni on Revanth: చంద్రబాబు ఏం చెబితే రేవంత్ అదే చేస్తాడు.. తెలంగాణ పీసీసీ చీఫ్‌పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు