
దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మరోవైపు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం నుంచి దైవ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు అవకాశం కల్పించారు.
మంగళవారం నుంచి అందరికీ దర్శనాలకు ఏర్పాట్లు చేయనున్నారు. మాస్కులు ధరిస్తేనే ఆలయ సిబ్బంది లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. లడ్డు ప్రసాద కౌంటర్ల దగ్గర తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. కొండపైకి వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాతనే భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. అన్ని ఏర్పాట్లు చేసిన తరువాతనే అనుమతి ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, దేశంలో కోవిడ్ విజృంభణ ఏమాత్రం తగ్గటం లేదు. రోజూ కొత్త కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన రెండు రోజుల నుంచి సగటున 10వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, మాల్స్, ఆలయాలను తెరవడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.