అక్క‌డ గ‌డ‌ప దాటితే…చలో క్వారంటైన్

కారణం లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారిని బుజ్జగించి పంపించడం లేదా కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల జరిగే నష్టాలను వివరించడం, కొన్ని సందర్భాల్లో వాహనాలను స్వాధీనం చేసుకో వడం వంటి చర్యలు చేపట్టారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రావ‌టంతో రూటు మార్చిన పోలీసులు ...

అక్క‌డ గ‌డ‌ప దాటితే...చలో క్వారంటైన్

Updated on: Apr 28, 2020 | 4:00 PM

ఏపీ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  లాక్‌డౌన్‌ వల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావ‌డంలేద‌ని భావించిన పోలీసు లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారిని బుజ్జగించి పంపించడం లేదా కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల జరిగే నష్టాలను వివరించడం, కొన్ని సందర్భాల్లో వాహనాలను స్వాధీనం చేసుకో వడం వంటి చర్యలు చేపట్టారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రావ‌టం త‌గ్గ‌క‌పోవ‌డంతో రూటు మార్చిన పోలీసులు వినూత్న ప్ర‌య‌త్నం చేశారు.
ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌ట్ట‌ణంలో 24 గంట‌ల సంపూర్ణ లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఈ ఆంక్ష‌ల‌ను అమ‌లులోకి తీసుకొచ్చి నేటికి ఐదురోజులు పూర్తైంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ప్రజలను చైతన్య పరచడానికి బయటకొచ్చిన కొంత మంది యువకులను అంబులెన్స్ లో క్వారంటైన్ కు తరలించే డెమో నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను సూచించి వారిని జాగ్రత్త పరచడానికే తప్ప భయానికి గురిచేయడానికి కాదని పోలీసులు తెలిపారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సరుకుల పంపిణీ జరుగుతోందని, అయితే కొంత మంది ఒకరిద్దరు వంతున బయటకు వస్తూనే ఉన్నారని అలాంటి వారికి జాగ్రత్తలు సూచించడానికి డెమో నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి బయటకొచ్చిన వారిపై 150 కేసులు నమోదు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్లు సీఐ నాగార్జున్ రెడ్డి తెలిపారు.