ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. అలాగే మన దేశంలోనూ కరోనా తీవ్రంగా వ్యాపిస్తూండటంతో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. కాగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు షాపులు తెరవడానికి సడలింపులు ఇచ్చింది. అయితే ఇన్ని రోజులూ లాక్డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా మిజోరంలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 50 శాతం మాత్రమే ఫీజులను వసూలు చేయాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం.
విద్యార్థుల నుంచి కేవలం 50 శాతం ఫీజు చెల్లించాలని ప్రైవేటు స్కూల్స్ని ఆదేశించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. తాజాగా స్కూళ్లు, కాలేజీల ఫీజులపై విద్యాశాఖ అధికారులు సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో ఫీజుల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందని, ఫీజుల విషయంలో ఇప్పటికే విద్యార్థి విభాగాలు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే అన్ని ప్రైవేటు, మిషన్ స్కూళ్లు నడిపిస్తున్న చర్చీల్లో కూడా పేద విద్యార్థులకు ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. ఏప్రిల్ నెలలో మొత్తం ఫీజును వసూలు చేసిన స్కూళ్లన్నీ.. మే నెలలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని స్కూల్ యాజమాన్యాలను ఆదేశించినట్టు మిజోరాం ప్రభుత్వం పేర్కొంది.
Read More: బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించిన జగన్