Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 15 వేలకు పైగా కేసుల నమోదు..
Maharashtra CoronaVirus: మహారాష్ట్రలో కరోనావైరస్ ఉధృతి రోజురోజూకు పెరుగుతోంది. ఇటీవల నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్పై..

Maharashtra CoronaVirus: మహారాష్ట్రలో కరోనావైరస్ ఉధృతి రోజురోజూకు పెరుగుతోంది. ఇటీవల నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్పై అప్రమత్తమైన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కేసులు పెరగుతుండటంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. నిన్న 14 వేలకుపైగా నమోదైన కరోనా కేసులు కాస్త.. ఈ రోజు 16వేలకు చేరువలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 15,817 మంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
తాజగా నమోదైన కేసులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 22,82,191 మందికి చేరింది. దీంతోపాటు మరణించిన వారి సంఖ్య 52,723 కి పెరిగింది. కరోనా నుంచి గడిచిన 24గంటల్లో 11,344 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 21,17,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,485 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటీవల మహా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోపాటు.. ఆంక్షలను సైతం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో నిన్న నాగపూర్లో లాక్డౌన్ను ప్రకటించింది. మళ్లీ తాజాగా శుక్రవారం అకోలా, పర్భణీ జిల్లాల్లో కూడా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు పూణెలో నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Also Read:




