లాక్‌డౌన్ ఎఫెక్ట్ఃఎక్సైజ్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు, రూ.5లక్షల ఫైన్‌..

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఇటువంటి స‌మ‌యంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ఎక్సైజ్ అధికారులే కంచే చేను మేసిందన్న చందంగా ఏపీలో కొంద‌రు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు..

లాక్‌డౌన్ ఎఫెక్ట్ఃఎక్సైజ్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు, రూ.5లక్షల ఫైన్‌..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 3:14 PM

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఇటువంటి స‌మ‌యంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ఎక్సైజ్ అధికారులే కంచే చేను మేసిందన్న చందంగా ఏపీలో కొంద‌రు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో స‌స్పెన్స‌న్ వేటుకు గుర‌య్యారు. అంతేకాకుండా ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే…

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కుతుకులూరు మారుతీనగర్‌లో గ‌ల‌ ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్‌ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్‌ కాని వాహనంలో మరికొందరు వచ్చారు. రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవుతుందని షాపు సూపర్‌వైజర్లు చెప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు. స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్‌ అక్కడి నుంచి వేగంగా తరలించాడు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలిసి, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్య నారాయ ణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం అక్ర మ తరలింపుపై సీఐ త్రినాథ్‌ను నిలదీశారు. తనకు ఎటువంటి సంబంధం లేదని, గ్రామంలో మద్యం తరలింపుపై సమాచారం రావడంతోనే తాను వచ్చానని, షాపు సూపర్‌వైజర్ల మాటల్లో వాస్తవం లేదని స‌ద‌రు సీఐ చెప్పుకొచ్చారు..దీనిపై ఎమ్మెల్యే ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా సీఐ త్రినాథ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రభుకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎక్సైజ్‌ సీఐ త్రినాథ్‌ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయితే, ఎక్సైజ్ సీఐ ఉదాంతంపై స్థానికులు మండిప‌డుతున్నారు. షాపునకు సీలు వేసేందుకు వస్తే సీఐ వాహనం వెంట మరో వాహనం ఎందుకు వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే కారులో ఉన్న వారు ఎక్సైజ్‌ సీఐ సెల్‌కు ఎందుకు ఫోన్‌ చేశారు? సీఐ ఆదేశం లేకుండా మద్యం బాటిళ్లు కారులోకి ఎలా వెళ్లాయి? అక్రమంగా మద్యం దొరికితే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంచనామా జరగకుండానే తన కార్యాలయానికి హడావుడిగా ఎందుకు తరలించారనే ప్రశ్నలకు సీఐ జవాబుదారి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.