కరోనా నేపథ్యంలో ఈ ఏడాది బోనాలు నిర్వహిస్తారా… లేదా అనే సందిగ్ధం కొనసాగుతోంది. దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగుతోంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొంటున్నారు. బోనాలు నిర్వహించాలా… వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక హైదరాబాద్ బోనాలు. కానీ ఏ మహమ్మారి దాడి చేసినా దాని నుంచి తమను కాపాడాలని అమ్మవారిని కోరుకొంటూ ఏటా బోనాలు జరుపుకొంటారు. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ సమాజంపై దండెత్తింది. కరోనా భయం వెంటాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తితో జనం భయంతో వణికిపోతున్నారు.ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సామూహికంగా బోనాలు జరుపుకోవడం మరింత ప్రమాదకరమని పండితులు, అమ్మవారి దేవాలయాల పూజారులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు.