చెట్టుపైనే 14 రోజుల క్వారంటైన్‌..వ‌ల‌స కూలీల అవ‌స్థ‌లు

|

Mar 30, 2020 | 7:16 AM

కరోనా ప్రభావంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరినీ హోం క్వారంటైన్ కు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే పేదలు తమ ఇంట్లో ఉండలేని పరిస్థితులతో కొందరు చెట్టునే ఆశ్రయంగా చేసుకుని..

చెట్టుపైనే 14 రోజుల క్వారంటైన్‌..వ‌ల‌స కూలీల అవ‌స్థ‌లు
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసినా..విన్నా కరోనా కరోనానే. ఈ కరోనా ప్రభావంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరినీ హోం క్వారంటైన్ కు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా ఈ విధంగా గ్రామాలు – పట్టణాల్లో హోంక్వారంటైన్ కొనసాగుతోంది. అయితే పేదలు తమ ఇంట్లో ఉండలేని పరిస్థితులతో కొందరు చెట్టునే ఆశ్రయంగా చేసుకుని 14 రోజులపాటు హోం క్వారంటైన్ గా ఉండటం సంచలనంగా మారింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని పురులియ జిల్లాలో చోటుచేసుకుంది.

పురులియ జిల్లాలోని ఓ గ్రామానికి తమిళనాడులోని చెన్నై నుంచి ఏడుగురు కార్మికులు వచ్చారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామంలోకి వచ్చిన కార్మికులను అధికారులు గుర్తించారు. వారిని పరిశీలించిన అనంతరం 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే వారు ఐసోలేషన్ కోసం విడిగా గదులు లేకపోవడంతో ఆ గ్రామస్తులు 14 రోజుల పాటు చెట్టును ఆవాసంగా చేసుకుని నివసిస్తున్నారు.

గ్రామానికి సమీపంలోని చెట్టును ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని కూర్చున్నారు. తమ ఇంట్లో హోం క్వారంటైన్ కు కావాల్సిన ఏర్పాట్లు లేకపోవడంతో గ్రామస్తుల సూచన మేరకు ఆ ఏడుగురు కార్మికులు చెట్టు ఎక్కారు. చెట్టుపై గుడారం ఏర్పాటుచేసుకున్నారు. చెట్టు కొమ్మలకు గుడ్డ కట్టి కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకోగా.. వంట కోసం కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు ఈ ఘటనను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. క్వారంటైన్ కోసం ఏర్పాటుచేయకపోవడంపై పలువురు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.