Corona alert! : హైదరాబాద్ ను అష్టదిగ్బంధనం చేయండి: సీఎం కేసీఆర్

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్‌ అమలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష‌ నిర్వహించారు.

Corona alert! : హైదరాబాద్ ను అష్టదిగ్బంధనం చేయండి: సీఎం కేసీఆర్

Updated on: May 07, 2020 | 7:33 AM

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  హైదరాబాద్‌ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులోని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్‌ అమలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష‌ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వైర‌స్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నవెూదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్‌ పై ఎక్కువ దృష్టి పెట్టాలని సిఎం కెసిఆర్‌ సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలన్నారు.

పాజిటివ్‌గా తేలితే అతన్ని కలిసిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించాలి. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్‌ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఐఎఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్ ను చుట్టుముట్టాలి. వైరస్‌ను తుదముట్టించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు