ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకీ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడుతోన్న విషయం తెలిసిందే. ఇక అందులోనూ ఈ మధ్య రాజకీయ నాయకులు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. తాజాగా ఏపీలో మరో మ్మెల్యేకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది.
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కొత్త పేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకి కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక గత వారం రోజులుగా ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇక తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. ఇందులో 97,681 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,12,687 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3796కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,976 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Read More:
బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి