లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఈ నెల 17వ తేదీ నుండి బెంగళూరు సహా పలు నగరాలకు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించగా మొదట పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాలని నిర్ణయించింది. మొదట 168 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు దశల వారీగా ఐదు వందలకు బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆన్లైన్లో రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. అలాగే పలు సూచనలు కూడా చేసింది ప్రభుత్వం.
కాగా బస్సులు నడిపేందుకు ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటక ప్రభుత్వాలకు లేఖలు రాసింది ఏపీఎస్ ఆర్టీసీ. కానీ కేవలం కర్ణాటక ప్రభుత్వం నుంచి మాత్రమే అంగీకారం రావటంతో ఈ నెల 17 నుంచి సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో భౌతిక దూరంతో పాటు మాస్కులను తప్పనిరిగా ధరించాలన్నారు. అలాగే బస్సుల్లో శానిటైజేషన్ తప్పకుండా చేయాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రానికి వచ్చిన వారిలో 5 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బస్టాండ్లలో కూడా కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది ఏపీఎస్ఆర్టీసీ.
Read More:
వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్లైన్స్ ఇవే..
బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్మెన్ మృతి
తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు