
హైదరాబాద్, జులై 1: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో నిర్వహించనున్న తెలంగాణ పీజీఈసెట్ (TG PGECET) 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ రెపట్నుంచి మొదలవనుంది. జులై 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్తోపాటు ఆన్లైన్ నమోదు ధ్రువీకరణ, ఆన్లైన్ చెల్లింపులు కూడా మొదలవుతాయి. అలాగే సర్టిఫికెట్ల స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ఇక విద్యార్ధులు జులై 13 నుంచి 15 వరకు తొలి విడుత వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది.
జులై 16న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించింది. మొదటి విడత సీట్ల కేటాయింపు జులై 19న జరుగుతుంది. కాలేజీల వారీగా ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జులై 20 నుంచి 24 వరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు రిపోర్టింగ్తోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే ముందు అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో కాలేజీల ఎంపిక విషయంలో విద్యార్ధులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే నచ్చిన కాలేజీలతోపాటు మెచ్చిన కోర్సుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ పీజీఈసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.