
హైదరాబాద్, జులై 9: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్-2026 కౌన్సెలింగ్లో పాల్గొన్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసీహెచ్ఈ) జులై 10న మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయి సీటు కేటాయింపు వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభమైంది. జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూన్ 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయ్యాయి. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జులై 4న మాక్ సీట్ల కేటాయింపు జాబితాను కూడా విడుదల చేశారు. ఇప్పుడు జులై 10న తొలి విడత అసలు సీట్ల కేటాయింపు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసారి టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య 1,44,704గా ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది 90 వేల నుంచి 95 వేల మంది వరకు కౌన్సెలింగ్లో పాల్గొంటుండగా, సుమారు 80 వేల మంది విద్యార్థులు సీట్లు పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జులై 10 నుంచి 14 వరకు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షంలో సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు సీటు కేటాయింపు ఫలితాలను వెంటనే పరిశీలించి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ తొలి విడత ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ జులై 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జులై 25 నుంచి 28 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే జులై 28 వరకు సీటు రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. మూడో విడత కౌన్సెలింగ్ జులై 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్టు 5న విడుదల కానుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 7 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. మొదటి విడతలో సీటు రాని వారు, సీటు అప్గ్రేడేషన్ కోరుకునే వారు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండో, మూడో విడతల కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తైన తర్వాత కూడా ఖాళీగా మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. దీంతో ఇంజినీరింగ్ సీటు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులకు మరో అవకాశం లభించనుంది. ప్రస్తుతం విద్యార్థుల దృష్టంతా జులై 10న విడుదల కానున్న తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలపైనే ఉంది.