
ఛహైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించని వారికి అలర్ట్.. ఈ రోజు (ఏప్రిల్ 23)తో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. విద్యార్ధులు ఏప్రిల్ 23వ తేదీ ముగింపు సమయంలోగా దరఖాస్తు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వాస్తవానికి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫీజు చెల్లించే గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. తుది గడువు పెంచాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు ఏప్రిల్ 23వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది.
ఇక షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి 21 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26న నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు సబ్జెక్టులు తప్పిన వారితోపాటు మెరుగైనా మార్కులు పొందేందుకు కూడా సబ్జెక్టులను మళ్లీ రాసేందుకు ఈ రోజు తుది గడువులోగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను చెల్లించినట్లు బోర్డు అధికారులు తాజాగా వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.