
హైదరాబాద్, డిసెంబర్ 12: కేంద్ర సాయుధ దళాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2026 సంవత్సరానికి మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,105 వరకు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణతో పురుషులకు పోస్టులు 455, మహిళలకు పోస్టులు 39 వరకు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పురుషులకు పోస్టులు 564, మహిళలకు పోస్టులు 47 వరకు ఉన్నాయి. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 31, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష (CBE), పీఈటీ/పీఎస్టీ, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగే అవకాశం ఉంది.
సీఏపీఎఫ్, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్ రైఫిల్మ్యాన్ జీడీ కానిస్టేబుల్ పోస్టుల్లో ఎంపికైనవారు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో దేనినైనా ఎంచుకోవచ్చు.
ఇతర వివరాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లింక్పై క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.