వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని దాదాపు 17,727 పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్) పరీక్ష 2024కుగానూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తుల గడువు జులై 2వ తేదీతో ముగియగా.. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. అంటే జులై 27వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజును కూడా జులై 28వ తేదీ వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కమిషన్ సూచించింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్మెంట్స్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్ధులకు సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే, విదేశీ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పోస్ట్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ వంటి తదితర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం.. టైర్-1 పరీక్ష గంట వ్యవధిలో ఆన్లైన్ విధానంలో రాయవల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ మినహా మిగతా అందరూ రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.