
న్యూఢిల్లీ, మే 16: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో తీగ లాగేకొద్దీ పందికొక్కులు ఒక్కొక్కటిగా కలుగులో నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి బండారం బయట పడగా.. ఈ రోజు బోటనీ టీచర్ వ్యవహారం బట్టబయలైంది. నీట్ పేపర్ లీక్లో బయాలజీ పేపర్ లీక్ కేసిన పుణెకు చెందిన బోటనీ టీచర్ను సీబీఐ ఈ రోజు అరెస్టు చేసింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం (మే 16) తెలిపింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మంధారేను సీబీఐ విచారించిన అనంతరం ఢిల్లీలో అరెస్టు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.
నీట్ పేపర్ తయారీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆమెను నిపుణురాలిగా నియమించిందని, ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రక్రియలో పనిచేసినట్లు సీబీఐ తెలిపింది. ఇప్పటికే అరెస్టు అయిన పూణేకు చెందిన మరో నిందితురాలు మనీషా వాగ్మారే ద్వారా ఏప్రిల్లో పరిచయం పెంచుకుని, నీట్ అభ్యర్థులతో పరిచయం ఏర్పరచుకుంది. అనంతరం తన ఇంట్లో ఆ విద్యార్థులకు కోచింగ్ తరగతులు నిర్వహించింది. ఆమె నీట్ పేపర్లో ఇచ్చిన బోటనీ, బయాలజీలకు చెందిన ఇంపార్టెంట్ ప్రశ్నలను విద్యార్థులు నోట్బుక్లలో రాసుకునేలా డిక్టేట్ చేసింది.
అలాగే పాఠ్యపుస్తకాలలోనూ గుర్తించుకునేలా చేసిందని సీబీఐ ఆరోపించింది. ఈ ప్రశ్నలలో చాలా వరకు మే 3న జరిగిన నీట్-యూజీ అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలాయని దర్యాప్తు సంస్థ తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నేరారోపణ పత్రాలు, ల్యాప్టాప్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, మొబైల్ ఫోన్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులపై సమగ్ర విశ్లేషణ జరుగుతోందని సీబీఐ తెలిపింది. కాగా మనీషా గురునాథ్ను ఎన్టీయే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నియమించింది. అయితే ఆమె నీట్ పేపర్లోని ప్రశ్నలను బయటకు వెళ్లడించడమేకాకుండా విద్యార్ధులు నోట్ బుక్స్లో రాసుకునేలా మక్కీకి మక్కీ లీక్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.