
JEE Main 2027 Dates Telugu: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) 2027కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. JEE Main 2027 పరీక్షను రెండు సెషన్లలో.. జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జనవరి సెషన్ పరీక్షలు 2027 జనవరి 22, 23, 24 తేదీల్లో, అలాగే జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. జనవరి 31ను బఫర్ డేగా కేటాయించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పలు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్, అర్హత, పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలతో కూడిన JEE Main 2027 ఇన్ఫర్మేషన్ బులెటిన్ను NTA ప్రత్యేకంగా విడుదల చేయనుంది.
JEE Main 2027 జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ, చివరి తేదీని NTA అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనుంది. అభ్యర్థులు JEE Main అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అయి వ్యక్తిగత, సంప్రదింపు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, పరీక్ష కేంద్రాల కోసం తమకు నచ్చిన నగరాలను ఎంచుకోవాలి. అనంతరం నిర్ణీత దరఖాస్తు ఫీజును చెల్లించి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీ, ఫీజు చెల్లింపు రసీదును డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవడం మంచిది.
JEE Main పరీక్షకు వయోపరిమితి లేదు. అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. 2025 లేదా 2026లో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, 2027లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఇతర నిర్దేశిత అర్హతలను కలిగి ఉంటే JEE Main 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Main పరీక్ష రాయడానికి 12వ తరగతిలో కనీస మార్కుల శాతం తప్పనిసరి కాదు. అయితే NITలు, IIITలు, ఇతర సంబంధిత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు సాధారణంగా 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు అవసరం. SC, ST అభ్యర్థులకు ఈ పరిమితి 65 శాతంగా ఉంటుంది.
BE/BTech: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (BE), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) పేపర్కు హాజరయ్యే అభ్యర్థులు 12వ తరగతిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఒక భాష, కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బయాలజీ/టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టుల్లో ఒకటి, అలాగే మరో అదనపు సబ్జెక్టును చదివి ఉండాలి.
BArch: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (BArch)కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటు మరో రెండు సబ్జెక్టులు చదివి ఉండాలి.
BPlanning: బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (BPlanning)కు మ్యాథమెటిక్స్తో పాటు మరో నాలుగు సబ్జెక్టులు అవసరం.
అవును. 12వ తరగతి ఉత్తీర్ణత సంవత్సరానికి సంబంధించిన నిర్దేశిత నిబంధనలను అభ్యర్థులు పాటిస్తే గ్యాప్ ఇయర్ తీసుకున్న విద్యార్థులు కూడా JEE Main 2027కు హాజరు కావచ్చు. అయితే రిజిస్ట్రేషన్ తేదీలు, పూర్తి అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, సిలబస్ తదితర తుది వివరాలు NTA విడుదల చేసే JEE Main 2027 అధికారిక ఇన్ఫర్మేషన్ బులెటిన్లో స్పష్టంగా వెల్లడవుతాయి. కాబట్టి అభ్యర్థులు అధికారిక ప్రకటనను పరిశీలించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.