
హైదరాబాద్, ఫిబ్రవరి 25: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 25తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన జేఈఈ మెయిన్ 2026 మలి విడత దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు రాత్రి 11.50 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. తొలి విడత పరీక్షలు రాసిన అభ్యర్ధులు కూడా జేఈఈ మెయిన్ సెషన్ 2కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక రెండు విడతల పరీక్షలు రాసిన వారికి రెండింటిలో ఉత్తమ స్కోర్ను అంతిమంగా పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్లో ర్యాంకు సాధించిన తొలి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2026 (ఏఏటీ 2026) పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తులు జూన్ 1 ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఏఏటీ-2026 జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఏఏటీ ఫలితాలు జూన్ 7, 2026వ తేదీన వెల్లడిస్తారు. ఇందులో ర్యాంకు సాధించిన వారికి ఐఐటీల్లోని బీఆర్క్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.