మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ

దేశంలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 5.56 లక్షల మందికి పైగా వివిధ పోస్టుల్లో నియామకాలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. 2024-25 రిక్రూట్‌మెంట్ సైకిల్‌లో 4.5 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 15 భాషల్లో 150కిపైగా నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు..

మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
Railway Recruitment On Mission Mode

Edited By:

Updated on: Jul 29, 2026 | 8:44 PM

హైదరాబాద్, జులై 29: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వేస్ నిరుద్యోగ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ రికార్డు సృష్టిస్తోంది. రైల్వే శాఖను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నడిపించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది.ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఏకంగా 5.56 లక్షల మందికి పైగా అభ్యర్థులను వివిధ పోస్టుల్లో నియమించినట్లు తెలిపారు.

మొత్తం భర్తీ చేసిన పోస్టులలో కేవలం సదరన్ రైల్వే పరిధిలోనే 50,485 ఉద్యోగాలను భర్తీ చేయడం విశేషం. దక్షిణాది యువతకు ఇది పెద్ద ఊరటగా నిలిచిందన్నారు. 2024 మరియు 2025 పరీక్షల సైకిల్‌లో భాగంగా నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఏకంగా 4.5 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పారదర్శకంగా, భారీ స్థాయిలో నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.

దేశవ్యాప్తంగా ఉన్న యువతకు సమాన అవకాశాలు కల్పించేందుకు,భాషా సమస్యలు లేకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 15 వేర్వేరు భాషల్లో పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా, సులభంగా పరీక్ష రాసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ నగరాల్లో అత్యాధునిక డిజిటల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గతంతో పోలిస్తే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ఇప్పుడు అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా ఫలితాలను విడుదల చేస్తున్నాయి. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ మరియు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉపయోగించి ఎటువంటి అక్రమాలకు తావులేకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహన జరుగుతుంది అని తెలిపారు. ఈ నియామకాల ద్వారా రైల్వే భద్రత ట్రాక్ నిర్వహణ, లోకో పైలట్లు, సాంకేతిక సిబ్బంది మరియు పరిపాలనా విభాగాలు మరింత బలపడ్డాయని, ఇది రైళ్ల నిర్వహణ మరియు ప్రయాణికుల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us